దుబాయ్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిఫ్ ఫైనల్కు సంబంధించిన అఫిషియల్స్ జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సోమవారం ప్రకటించింది. జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఇప్పటికే ఇరు జట్లు తమ టీమ్ వివరాలను ప్రకటించాయి. ఇంగ్లండ్ చేరి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఐసీసీ ప్రకటించిన మ్యాచ్ అధికారుల జాబితాలో ఇంగ్లండ్కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, న్యూజిలాండ్కు చెందిన క్రిస్ గాఫనే ఆన్ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. ఇంగ్లండ్కే చెందిన రిచర్డ్ కెటిల్బరో టీవీ అంపైర్గా పనిచేయనున్నాడు.

శ్రీలంకకు చెందిన కుమార్ ధర్మసేన నాలుగో అంపైర్గా విధులు నిర్వహించనుండగా.. వెస్టిండీస్కు చెందిన రిచీ రిచర్డ్సన్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు. ఐసీసీ ప్రకటించిన ఈ అఫిషియల్స్ జాబితాలో రిచర్డ్ కెటిల్ బరో పేరు చూసి భారత అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
ఎందుకంటే రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేసిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో భారత్ ఓడింది. దాంతోనే అతన్ని అంపైర్గా తీసుకోవద్దని ఇండియన్ ఫ్యాన్స్ ఐసీసీకి రిక్వెస్ట్ చేశారు. 2014 టీ20 ప్రపంచకప్ నుంచి 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు రిచర్డ్ కెటిల్బరో అంపైరింగ్ చేసిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో భారత్ ఓటమిపాలైంది.
బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేతిలో 6 వికెట్లతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన 2015 వన్డే వరల్డ్ కప్లోనూ భారత్కు ఇదే పరిస్థితి ఎదురైంది.
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 95 పరుగులతో చిత్తుగా ఓడి ఇంటిదారిపట్టింది. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. టోర్నీ ఆసాంతం దూకుడుగా ఆడిన టీమిండియా.. సెమీస్లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఇక 2017లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది.
కెటిల్ బరో ఐరెన్ లెగ్ అంపైరింగ్ పుణ్యమా.. ఐసీసీ ఈవెంట్లో పాక్ చేతిలో ఎన్నడూ ఓడని కోహ్లీసేన చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో 180 పరుగులతో ఓడి టైటిల్ చేజార్చుకుంది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్లోనూ న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ధోనీ రనౌట్ అయినప్పుడు లెగ్ అంపైర్గా ఉన్న కెటిల్ బరో.. 'అయ్యో' అని ఇచ్చిన ఎక్స్ప్రెషన్ను భారత అభిమానులు ఇంకా మరిచిపోలేదు.
2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో టీవీ అంపైర్గా ఉండగా.. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే కెటిల్బరోను భారత అభిమానులు ఐరెన్ లెగ్ అంపైర్గా విమర్శిస్తారు.