హైదరాబాద్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2022-23 ఫైనల్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదంగా మారిన 'సాఫ్ట్ సిగ్నల్' నిబంధనను తొలగించింది. భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచే ఇది అమలుకానుంది.
అయితే ఈ విషయంపై ఐసీసీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నిబంధనను తొలగించిన విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ పేర్కొంది. ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. క్రికెట్లో వివాదాలకు కారణమవుతున్న ఈ నిబంధనను తొలగించే ప్రతిపాదనకు సౌరవ్ గంగూలీ సారథ్యంలోని ఐసీసీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మైదానంలో సహజంగా వెలుతురు మందగించినప్పుడు ఫ్లడ్ లైట్స్తో ఆటను కొనసాగించేలా కూడా మార్పులు తీసుకువచ్చిందని పేర్కొంది.

సాఫ్ట్ సిగ్నల్ కారణంగా చాలా క్యాచ్ ఔట్ల విషయంలో దుమారం రేగింది. మైదానంలో సందేహస్పదంగా ఉన్న ఔట్ విషయంలో అంపైర్లు.. థర్డ్ అంపైర్కు నివేదిస్తూనే సాఫ్ట్ సిగ్నల్ రూపంలో ఔటా? నాటౌటా? అని ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఆ ఔట్ విషయంలో ఫీల్డ్ అంపైర్ అభిప్రాయాన్ని సాఫ్ట్ సిగ్నల్ రూపంలో చెప్పడమే.
రివ్యూల్లో స్పష్టత రానప్పుడు, సరైన ఆధారాలు లభించనప్పుడు థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ను పరిగణలోకి తీసుకొని నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ఇలా చాలా సందర్భాల్లో అంపైర్ సాఫ్ట్ సిగ్నల్కు కట్టుబడి తుది నిర్ణయం వెల్లడించడంపై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ క్రమంలోనే ఈ సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను ఎత్తేయాలని ఐసీసీ నిర్ణయించింది. తాజా మార్పుతో థర్డ్ అంపైరే తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. క్యాచ్ ఔట్ల విషయంలోనే ఎక్కువగా ఈ గందరగోళం చోటు చేసుకుంటుంది. ఇంగ్లండ్లోని ఓవల్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. జూన్7-11 వరకు ఈ మ్యాచ్ జరగనుండగా.. జూన్ 12ను రిజర్వేడేగా కేటాయించారు.