న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ తుది దశకు చేరుకుంది. మరో 20 రోజుల్లో ఈ ధనాధన్ లీగ్కు తెరపడనుంది. ఈ మెగా లీగ్ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో భాగంగా జూన్ 7-11 మధ్య ఒవల్ వేదికగా జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. టీమిండియాకు ఇది వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ కాగా.. ఆస్ట్రేలియా తొలి సారి ఈ మెగా టెస్ట్ ఫైనల్ ఆడనుంది.
ఐపీఎల్ 2023 సీజన్ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ధనాధన్ టోర్నీ ఆడుతుండగా.. కొందరు మాత్రం ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. ఈ సీజన్ లీగ్ దశ ముగిసిన వెంటనే ప్లే ఆఫ్స్ చేరని జట్లలోని ఆటగాళ్లంతా ఇంగ్లండ్ వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ప్రస్తుతం భారత జట్టులో ఇద్దరే ఇద్దరు ఆటగాళ్లు పేలవ ఫామ్తో బాధపడుతుండగా.. మిగతా 9 మంది సూపర్ ఫామ్లో ఉన్నారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన రోహిత్ 184 పరుగులే చేశాడు. గత రెండు ఇన్నింగ్స్ల్లో డకౌటయ్యాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వంటి మెగా టైటిల్ గెలవాలంటే స్టార్ ఓపెనర్ అయిన రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం చాలా ముఖ్యం.
శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే సూపర్ ఫామ్లో ఉండగా.. ఐపీఎల్కు దూరంగా ఉన్న చతేశ్వర్ పుజారా కౌంటీ క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. సస్సెక్స్ తరఫున నాలుగు మ్యాచ్ల్లో మూడు సెంచరీలు బాదాడు.
రహానే.. ఐపీఎల్లో కనబర్చిన సూపర్ ఫామ్తో జట్టులోకి వచ్చాడు. అంతేకాకుండా ఈ ఏడాది రంజీ ట్రోఫీతో పాటు కౌంటీ క్రికెట్లోనూ అతను సత్తా చాటాడు. గిల్, కోహ్లీలు ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్నారు.
వికెట్ కీపర్ కేఎస్ భరత్కు మాత్రం ఐపీఎల్లో ఆడే అవకాశం రాలేదు. గుజరాత్ టైటాన్స్కు ఆడుతున్న అతను పూర్తిగా బెంచ్కే పరిమితమయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన భరత్.. ఒకటి, రెండు ఇన్నింగ్స్లు మినహా పెద్దగా రాణించలేదు. దాంతోనే కేఎల్ రాహుల్ను ప్రధాన వికెట్ కీపర్గా ఎంపిక చేయగా.. అతను తొడకండరాల గాయంతో ఐపీఎల్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరమయ్యాడు.

ఇషాన్ కిషన్ను బ్యాకప్ వికెట్ కీపర్గా తీసుకున్నా.. భరత్కే తుది జట్టులో అవకాశం దక్కనుంది. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్లో సత్తా చాటుతూ సూపర్ ఫామ్లో ఉన్నారు. పేసర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ దుమ్మురేపుతున్నారు. సిరాజ్ 10 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీయగా.. షమీ 11 మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.
పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా కేకేఆర్ తరఫున సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా లోయరార్డర్లో బ్యాటింగ్కు వచ్చి విలువైన పరుగులు చేస్తున్నాడు. శార్దూల్ బౌలింగ్.. ఇంగ్లండ్ కండిషన్స్కు సరిగ్గా సూటవ్వనుంది.