లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా కాంబినేషన్ బెడిసికొట్టిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను కాదని బరిలోకి దిగడం టీమిండియా చేసిన ఘోర తప్పిదమని మాజీ క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మను ఏకీపారేస్తున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిలకడగా ఆడుతోంది.
బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ పేస్కు అనుకూలంగా ఉండటంతో పాటు వాతావరణం చల్లగా ఉండటంతో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. స్పిన్నర్గా బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన రవీంద్ర జడేజాను తీసుకుంది. తొలి సెషన్లో రెండు కీలక వికెట్లు తీసిన భారత బౌలర్లు.. రెండో సెషన్లో మాత్రం పూర్తిగా తేలిపోయారు.

మహమ్మద్ షమీ ఒక్కడే ఒక వికెట్ తీసినా.. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. దాంతో రెండో సెషన్ పూర్తిగా ఆస్ట్రేలియా ఖాతాలో పడింది. అశ్విన్కు బదులు తుది జట్టులోకి వచ్చిన ఎక్స్ట్రా పేసర్ ఉమేశ్ యాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. రెండు సెషన్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మిగతా పేసర్లు తలో వికెట్ తీసినా.. ఉమేశ్ తన ప్రభావం చూపలేకపోయాడు.
రెండో సెషన్లో ఆసీస్ బ్యాటర్ల స్వేచ్చగా బ్యాటింగ్ చేయడం చూసిన ఫ్యాన్స్.. అశ్విన్ లేని లోటు స్పష్టంగా కనబడుతుందని కామెంట్ చేశారు. అశ్విన్ లేకుండా బరిలోకి దిగడం టీమిండియా చేసిన తప్పిదమని మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్, మైఖేల్ వాన్, సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు.
పేస్ ట్రాప్లో టీమిండియా పడిపోయిందని, ఫస్ట్ ఇన్నింగ్స్ కోసమే తుది జట్టును ఎంపిక చేసిందని పాంటింగ్ విమర్శించగా.. అశ్విన్ లేకుండా బరిలోకి దిగడం టీమిండియా చేసిన ఘోర తప్పిదమని మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. తానే కెప్టెన్ అయితే అశ్విన్ను తుది జట్టులోకి తీసుకునేవాడినని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఓవల్ మైదానంలో ప్రస్తుతం ఎండ కొడుతుండటంతో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారింది.
ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆసీస్ను కట్టడి చేయకపోతే ఈ మ్యాచ్ గెలవడం కష్టమని ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. ఇంగ్లండ్ కండిషన్స్లో నాలుగో ఇన్నింగ్స్ ఆడటం అంత సులువు కాదని, ఫస్ట్ ఇన్నింగ్స్లో వీలైనంత తక్కువ స్కోర్కు కట్టడి చేసి అనంతరం భారీ ఆధిక్యం సాధించాలన్నాడు.
ఫస్ట్ సెషన్లో రెండు వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసిన ఆసీస్.. రెండో సెషన్లో మాత్రం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. స్మిత్ హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.