హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఓటమి నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను రక్షిస్తున్నారని, అతని పీఆర్ టీమ్.. టాపిక్ డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ వైఫల్యంపై చర్చ జరగకుండా అతని పీఆర్ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుందని, టాపిక్ను ధోనీ, కోహ్లీ వైపు మళ్లించడంలో సక్సెస్ అయ్యిందని అభిప్రాయపడుతున్నారు.
ఆస్ట్రేలియాతో ఆదివారం ముగిసిన ఈ మెగా ఫైనల్లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. పేలవ బ్యాటింగ్తో పాటు చెత్త బౌలింగ్ , లాక్ ఆఫ్ ప్రిపరేషన్స్ టీమిండియా కొంపముంచింది. కెప్టెన్గా రోహిత్ శర్మ కూడా దారుణంగా విఫలమయ్యాడు. టీమ్ ఎంపిక దగ్గర నుంచి బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ విషయాల్లో రోహిత్ పూర్తిగా చేతులెత్తేసాడు.

ఐదు రోజుల ఆటలో గెలవాలనే కసి టీమిండియా ఆటగాళ్లలో ఏ రోజు కనిపించలేదు. కెప్టెన్గా జట్టును ఉత్సాహపరచాల్సిన రోహిత్ శర్మ కూడా డీలా పడిపోయాడు. బ్యాటింగ్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. కీలకమైన రెండో ఇన్నింగ్స్లో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సిన కెప్టెన్ రోహిత్ శర్మ.. చెత్త షాట్తో పెవిలియన్ బాట పట్టాడు.
అయితే ఈ ఓటమి అనంతరం రోహిత్ శర్మ వైఫల్యం గురించి ఎక్కడా చర్చ జరగకుండా అతన్ని పీఆర్ టీమ్ జాగ్రత్త పడింది. డబ్ల్యూటీసీ ఓటమి చర్చను ధోనీ, కోహ్లీల వైపు డైవర్ట్ చేసింది. ధోనీ ఒక్కడికే ఐసీసీ టైటిళ్లు సాధ్యమనే చర్చను తెరపైకి తెచ్చి రోహిత్ శర్మ వైఫల్యాలను చర్చించకుండా చేయడంలో సక్సెస్ అయ్యింది.
అంతేకాకుండా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తోంది. సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, హర్భజన్ సింగ్ అందరూ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యం గురించి మాట్లాడారే తప్పా రోహిత్ కెప్టెన్సీ, బ్యాటింగ్ వైఫల్యం గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు. అంతేకాకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ను బెస్టా ఆఫ్ త్రీ ఫార్మాట్లో నిర్వహించాలన్న రోహిత్ కామెంట్స్కు కౌంటరిస్తూ అతని వైఫల్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు.
డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన తర్వాత కోహ్లీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీని తప్పించాలని గౌతమ్ గంభీర్తో పాటు చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీ వైఫల్యంపై మాత్రం గంభీర్తో సహా ఏ ఒక్కరు కూడా మాట్లాడటం లేదు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు అభిమానులు.. రోహిత్ను కాపాడటంతో అతని పీఆర్ టీమ్ సక్సెస్ అయ్యిందని కామెంట్ చేస్తున్నారు.