హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముంగిట టీమిండియాను బ్యాక్ టు బ్యాక్ ఫైనల్ సెంటిమెంట్ ఊరిస్తోంది. లండన్లోని ఓవల్ మైదానం వేదికగా జూన్ 7-11 మధ్య ఆస్ట్రేలియాతో జరగనున్న డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఇరు జట్లు లండన్ చేరి ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.
విజయమే లక్ష్యంగా టీమ్ కాంబినేషన్స్ను సిద్దం చేసుకుంటున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం ఆస్ట్రేలియాకు తొలిసారి కాగా.. టీమిండియాకు వరుసగా రెండో సారి. డబ్ల్యూటీసీ 2019-21 అరంగేట్ర ఎడిషన్లో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన టీమిండియా తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైన గద(డబ్ల్యూటీసీ టైటిల్)ను అందుకోవాలనే పట్టుదలతో ఉంది.

తద్వారా గత 10 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ టైటిల్ కొరతను తీర్చుకోవాలనుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ బ్యాక్ టు బ్యాక్ ఫైనల్ సెంటిమెంటే టీమిండియాను ఊరిస్తోంది. ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ ఆడిన ప్రతీ జట్టు టైటిల్ గెలిచింది.
వన్డే ప్రపంచకప్ను ప్రవేశపెట్టిన తర్వాత వెస్టిండీస్ వరుసగా రెండు సీజన్లలో ఫైనల్ ఆడి టైటిల్స్ గెలిచింది. 1975లో మొదటి వన్డే వరల్డ్ కప్ గెలిచిన విండీస్.. 1979లో రెండో ప్రపంచకప్ గెలిచింది. టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్.. వరుసగా ఫైనల్స్ ఆడి విజయాలందుకుంది.
అరంగేట్ర టీ20 వరల్డ్ కప్ 2007 ఫైనల్లో టీమిండియా చేతుల్లో 5 పరుగుల తేడాతో ఓడిన పాకిస్థాన్.. ఆ తర్వాత 2009 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్ సాధించింది. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో వరుసగా రెండో ఫైనల్ చేరిన టీమిండియా కూడా ఈ బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ సెంటిమెంట్ రిపీట్ అయితే విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కెప్టెన్గా రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఒక్క ఫైనల్ కూడా ఓడిపోలేదు. డబ్ల్యూటీసీ టైటిల్ గెలుపు ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్పై కూడా పడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ ఉత్సాహంలో వన్డే ప్రపంచకప్ను కూడా గెలవచ్చని అభిప్రాయపడుతున్నారు.