లండన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి 296 పరుగుల ఆధిక్యంలో నిలిచి ఆసీస్ మ్యాచ్పై పట్టుబిగించింది. అయితే మూడో రోజు ఆట అనంతరం టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ లైవ్లో మాట్లాడుతుండగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
దినేశ్ కార్తీక్తో కలిసి అధికారిక బ్రాడ్కాస్టర్ ప్రిమ్యాచ్ షోలో హర్భజన్ టీమిండియా గెలుపు అవకాశాల గురించి చర్చించాడు. హర్భజన్ - దినేశ్ కార్తీక్లు మ్యాచ్ తీరును విశ్లేషిస్తుండగా.. వారి వెనుకాల నిలుచున్న కొందరు అభిమానులు ఆసక్తిగా విన్నారు.

వారి ముందు బెంచ్పై బీర్ గ్లాస్లు ఉండటాన్ని గమనించిన కెమెరామెన్.. అక్కడే ఉన్న ఓ సర్దార్ను పిలిచి దాన్ని తీసేయాలని కోరాడు. ముందుగా ఆ సర్దార్ కు కెమెరామెన్ చెప్పింది అర్థం కాలేదు. ఆ తర్వాత కెమెరామెన్ స్పష్టంగా బీర్ గ్లాస్ అని సైగలు చేయడంతో తేరుకుని దానిని అక్కడ్నుంచి తీసి కెమెరాకు కనబడని చోటులో పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కెమెరామెన్ గ్లాస్ తీయమనలేదని, తనకో సిప్ ఇవ్వమన్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. 'ఏదేమైనా సర్దార్ ఎక్స్ప్రెషన్స్ అయితే కేక.. ముఖ్యంగా లాస్ట్ లో ఆ థమ్సప్ సింబల్ అయితే సూపర్'అని మరొకరు కామెంట్ చేశారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్లో 469 పరుగులు చేయగా.. టీమిండియా 296 పరుగులకు కుప్పకూలింది. దాంతో ఆసీస్కు 173 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 167 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఇప్పటికే ఆసీస్ ఆధిక్యం 350 ధాటింది.