హైదరాబాద్: గత రెండు నెలలపాటు హోరాహోరీ మ్యాచ్లతో ఐపీఎల్ 2023 మజాను ఆస్వాదించిన అభిమానులకు వచ్చే వారం అంతకు మించిన క్రికెట్ పండుగ కనువిందు చేయనుంది. జూన్ 7-12 వరకు లండన్లోని ఓవల్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టెస్ట్ వరల్డ్ కప్గా భావించే ఈ టోర్నీ విజేతకు ఛాంపియన్షిప్ గదతో పాటు ప్రైజ్మనీ దక్కనుంది.
ఆస్ట్రేలియాకు ఇది తొలి ఫైనల్ కాగా.. టీమిండియా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది. ఇంగ్లండ్ వేదికగానే డబ్ల్యూటీసీ 2019-21 ఎడిషన్ ఫైనల్ జరగ్గా.. టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే గతేడాది చేజారిన డబ్ల్యూటీసీ టైటిల్ను ఈసారి ఎలాగైనా సాధించాలని టీమిండియా భావిస్తోంది.

అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే భారత ఆటగాళ్లు ఐపీఎల్ మత్తును వీడాలి. సుమారు రెండున్నర నెలలపాటు టీమిండియాలోని మెజారిటీ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడారు. ఉన్నట్టుండి తమ ఆటను టెస్ట్ ఫార్మాట్కు మార్చుకోవడం చాలా కష్టం. అందుకే టీమిండియా మేనేజ్మెంట్ ముందుగానే ఆటగాళ్లను ఇంగ్లండ్కు పంపించింది. చతేశ్వర్ పుజారా ఒక్కడే ఐపీఎల్ ఆడకుండా లండన్లో కౌంటీ క్రికెట్ ఆడాడు.
కాబట్టి భారత స్టార్ ఆటగాళ్లు వీలైనంత త్వరగా తమ ఆటను టెస్ట్ ఫార్మాట్కు తగ్గట్లు మార్చుకోవాలి. అంతేకాకుంటా టీమిండియా టాప్-5 బ్యాటర్లలో ఏ ఇద్దరూ చెలరేగినా తిరుగుండదు. ముఖ్యంగా సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, వెటరన్ అజింక్యా రహానే అదే జోరును కొనసాగించాలి. శుభ్మన్ గిల్, కోహ్లీ వరుస సెంచరీలతో జోరుమీద ఉండగా.. రహానే సంచలన బ్యాటింగ్తో ఏడాదిన్నర తర్వాత జట్టులోకి వచ్చాడు.
ఓవల్ మైదానం కాస్త స్పిన్నర్లకు అడ్వాంటేజ్ ఉన్న నేపథ్యంలో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. అశ్విన్, జడేజా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఈ ఇద్దరూ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ రాణించాలి. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో భారత పేస్ భారం షమీ, సిరాజ్పైనే ఉంది. ఈ ఇద్దరూ ఐపీఎల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చారు. అదే జోరును కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు.