లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముంగిట టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైనట్లు తెలుస్తోంది. మంగళవారం నెట్స్లో రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. అతని ఎడమ చేతి బొటన వేలికి గాయమైనట్లు సమాచారం. బౌలర్ వేసిన బంతి బలంగా తాకడంతో రోహిత్ నొప్పితో విలవిలాడినట్లు తెలుస్తోంది.
రోహిత్ శర్మ తన బొటన వేలుకు టేపు చుట్టుకుంటున్న ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. గాయం వార్తలకు ఇవి బలం చేకూరుస్తున్నాయి. ఈ గాయంతో హిట్ మ్యాన్ ప్రాక్టీస్ నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది. కీలక ఫైనల్ మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ గాయపడినట్లు వస్తున్న వార్తలపై అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

అయితే రోహిత్ శర్మకు అయిన గాయం పెద్దది కాదని, ఎవరూ ఆందోళపడాల్సిన అవసరం లేదని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ తెలియజేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించాలంటే రోహిత్ శర్మ రాణించడం కీలకం. బ్యాటర్గానే కాకుండా కెప్టెన్గా రోహిత్ శర్మ అవసరం జట్టుకు ఎంతో ఉంది. ఈ ఫైనల్కు అతను దూరమైతే.. టీమ్ బలహీనంగా మారనుంది.
లండన్లోని ఓవల్ మైదానం వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేశాయి. టీమ్ కాంబినేషన్తో పాటు విజయం కోసం కావాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఇక టీమిండియా కాంబినేషన్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారా? లేక ఎక్స్ట్రా పేసర్రు ఆడిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అలాగే మూడో పేసర్గా ఎవర్నీ ఆడిస్తారో తెలాల్సి ఉంది. వికెట్ కీపర్గా కేఎస్ భరత్ను కొనసాగిస్తారా? లేక ఇషాన్ కిషన్ను ఆడిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇవన్నిటికీ బుధవారమే సమాధానం దొరకనుంది.
తుది జట్టు ఎంపికపై బుధవారమే తుది నిర్ణయం తీసుకుంటామని, ఆటగాళ్లందర్నీ సిద్దంగా ఉండాలని చెప్పామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తన సారథ్యంలో టీమిండియాకు 2-3 ఐసీసీ ట్రోఫీలు అందించాలని ఉందని రోహిత్ శర్మ తెలిపాడు. ఆ దిశగా తాను జట్టును నడిపించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు.