లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. భారత్తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మెగా మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్లో సత్తా చాటిన ఆసీస్ అనంతరం బౌలింగ్లో మెరిసింది. ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 38 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది.
క్రీజులో అజింక్యా రహానే(29 బ్యాటింగ్), శ్రీకర్ భరత్(3 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా టాప్-4 బ్యాటర్లు రోహిత్ శర్మ(15), శుభ్మన్ గిల్(13), చతేశ్వర్ పుజారా(14) దారుణంగా విఫలమయ్యారు. రవీంద్ర జడేజా(48) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో బౌలింగ్ చేసిన ప్రతీ ఒక్కరు తలో వికెట్ తీసారు.

ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా 71 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో అజింక్యా రహానేతో కలిసి రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నాడు. ఐదో వికెట్కు 71 పరుగులు జోడించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన జడేజాను నాథన్ లయన్ క్యాచ్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్తో మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడిన రహానే.. రెండో రోజు ఆటను ముగించాడు. టీమిండియా ఇంకా 318 పరుగుల వెనుకంజలో ఉంది.
ఈ పరుగులను టీమిండియా అధిగమించాలంటే మూడో రోజు మొత్తం బ్యాటింగ్ చేయాలి. ఇది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఫస్ట్ సెషన్లోనే టీమిండియా ఆలౌటైతే.. మ్యాచ్ మూడున్నర రోజుల్లోనే ముగిసే అవకాశం ఉంది. అద్భుతం జరిగితే తప్పా టీమిండియా ఓటమి తప్పించుకోలేదు.
అంతకుముందు 327/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్ ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా 469 పరుగులకు కుప్పకూలింది. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్(4/108) నాలుగు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ ఆట సెషన్నరలోనే ముగిసింది.
ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్కు తోడుగా మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీసారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది.