న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మాస్టర్ ప్లాన్ సిద్దం చేసింది. ఈ ఐసీసీ టైటిల్ను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా.. తమ ఆటగాళ్లను ముందుగానే ఇంగ్లండ్ పంపించే ఏర్పాట్లు చేస్తోంది. లండన్లోని ఓవల్ వేదికగా జూన్ 7-11 మధ్య జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పరిస్థితులను అలవాటు చేసుకునేందుకు రెండు వారాల ముందే తమ ఆటగాళ్లను ఇంగ్లండ్ పంపించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకుంది.
ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఎంపికైన ఆటగాళ్లందరూ మే 20 తర్వాత ఇంగ్లండ్ చేరుకోవాలని ఆదేశించింది. ఐపీఎల్ 2023 సీజన్ కాంట్రాక్టులున్నా.. వదిలేసి రావాలని స్పష్టం చేసింది. ఇప్పటికే మార్నస్ లబుషేన్తో పాటు మరికొందరు ఆసీస్ ప్లేయర్లు ఇంగ్లండ్ చేరుకొని కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. తద్వారా అక్కడి పరిస్థితులను అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మే 28న జరగనుండగా.. మే 23 నుంచి ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయంతో డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపికైన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ ఆడకుండానే ఇంగ్లండ్ బయలుదేరనున్నారు. ఐపీఎల్ 2023 సీజన్ ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లలో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (ఢిల్లీ క్యాపిటల్స్), గ్లేన్ మ్యాక్స్వెల్, జోష్ హజెల్వుడ్ (ఆర్సీబీ), కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ (ముంబై ఇండియన్స్)లు ఉన్నారు.
అయితే వీరిలో డబ్ల్యూటీసీ ఫైనల్స్ టీమ్లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు కామెరూన్ గ్రీన్, జోష్ హజెల్ వుడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్లు మాత్రమే. ఐపీఎల్ 2023 సీజన్ ఫస్టాఫ్ ముగిసినా.. ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ లేదు. ప్రస్తుతానికి టాప్-4లో సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి. ఈ నాలుగు జట్లలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు లేరు. ఒకవేళ ముంబై, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరితో ఆ జట్లు కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోనున్నాయి.
మరోవైపు భారత్ కూడా మే 23-24 నుంచి లండన్లో ప్రాక్టీస్ క్యాంప్ మొదలుపెట్టనుంది. అయితే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చేరని ఆటగాళ్లు మాత్రమే ఈ క్యాంప్కు హాజరుకానున్నారు.