లండన్: భారత్తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. భారత్ ముందు 444 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. 123/4 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది.
167 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్ను మిచెల్ స్టార్క్(57 బంతుల్లో 7 ఫోర్లతో 41), అలెక్స్ క్యారీ(105 బంతుల్లో 8 ఫోర్లతో 66 నాటౌట్) ఆదుకున్నారు. 97 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్కు ఓ వికెట్ దక్కింది.

ఓ దశలో 200 పరుగుల్లోపే ఆలౌటయ్యేలా కనిపించిన ఆసీస్.. క్యారీ సూపర్ బ్యాటింగ్తో టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. దాంతో మూమెంటమ్ మొత్తం ఆసీస్ వైపు మళ్లింది. అద్భుతం జరిగితే తప్పా టీమిండియా ఈ మ్యాచ్లో గెలవలేదు. కనీసం డ్రా చేసుకున్నా గొప్పే.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్లో 469 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగగా.. అలెక్స్ క్యారీ(69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48), డేవిడ్ వార్నర్(60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు.
అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు కుప్పకూలింది. అజింక్యా రహానే(129 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 89), శార్దూల్ ఠాకూర్(109 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకోగా.. రవీంద్ర జడేజా(51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 48) విలువైన పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీసాడు. నాథన్ లయన్ ఓ వికెట్ పడగొట్టాడు.