లండన్: ప్రతిష్టాత్మక వరల్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మెగా ఫైనల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో మరోసారి ఐసీసీ టైటిల్ గెలుచుకునే సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. గత దశాబ్దకాలంలో ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు ఇది తొమ్మిదో పరాజయం.
పేలవ బౌలింగ్, పసలేని బ్యాటింగ్, చెత్త కెప్టెన్సీ.. లాక్ ఆఫ్ ప్రిపరేషన్ టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు అయితే.. కొందరు అభిమానులు మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ వల్లే ఓడిపోయిందంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. అనుష్క శర్మది ఐరెన్ లెగ్ అని, ఆమె అడుగుపెడితే టీమిండియా ఓడిపోతుందని కామెంట్ చేస్తున్నారు.

ఆమె హాజరైన ప్రతీ ఐసీసీ టోర్నీలో టీమిండియాకు ఓటమే ఎదురైందని ఆధారాలతో సహా వాదిస్తున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నుంచి ఇది కొనసాగుతుందని, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్తో పాటు 2021 డబ్ల్యూటీసీ ఫైనల్కు కూడా అనుష్క హాజరైందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్కు రావద్దని అనుష్క శర్మను రిక్వెస్ట్ చేస్తున్నారు.
టీమిండియా ఆటగాళ్ల చేతకాని తనం వల్ల టీమిండియా ఓడిపోతే ఓ మహిళను నిందించడం ఏంటని కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. టీమిండియా ఓటమికి ఆటగాళ్ల వైఫల్యమే కారణమని, ముఖ్యంగా చెత్త బ్యాటింగ్ టీమిండియా పతనాన్ని శాసించిందని చెబుతున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా సరైన ప్రిపరేషన్స్తో రాలేదని, ముఖ్యంగా ఆసీస్ ఆటతీరుకు తగ్గట్లు వ్యూహాలు సిద్దం చేసుకోలేకపోయిందని కామెంట్ చేస్తున్నారు.
ఓ మహిళను నిందించడం సరికాదని కౌంటరిస్తున్నారు. మ్యాచ్ చూడాలని, ఆటగాళ్ల భార్యలను కాదని కౌంటరిస్తున్నారు. 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), అంజిక్యా రహానే(108 బంతుల్లో 7 ఫోర్లతో 46), రోహిత్ శర్మ(60 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్కు రెండు వికెట్లు దక్కగా.. ప్యాట్ కమిన్స్కు ఓ వికెట్ దక్కింది.