లండన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. తొలి రోజు చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత బౌలర్లు రెండో రోజు దుమ్మురేపారు. దాంతో ఆస్ట్రేలియా తొలి సెషన్లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా మైదానంలోకి వచ్చిన అక్షర్ పటేల్ అదిరిపోయే ఫీల్డింగ్తో ఔరా అనిపించాడు. స్టన్నింగ్ త్రోతో మిచెల్ స్టార్క్ను రనౌట్గా పెవిలియన్ చేర్చాడు.
ప్రస్తుతం ఈ రనౌట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మహమ్మద్ సిరాజ్ వేసిన 104వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని సిరాజ్ లెంగ్త్ బాల్గా వేయగా.. స్టార్క్ పుష్ చేసి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ బౌలర్స్ ఎండ్లో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్.. బంతిని సింగిల్ హ్యాండ్తో అందుకొని వికెట్లకు కొట్టేసాడు. దాంతో మిచెల్ స్టార్క్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

సూపర్ ఫీల్డింగ్తో ఆకట్టుకున్న అక్షర్ పటేల్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తుది జట్టులో లేకున్నా అక్షర్ పటేల్ తన ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడని కొనియాడుతున్నారు.
327/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా తడబడింది. ఓవర్ నైట్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించినా.. ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయింది. తొలి ఓవర్లోనే స్మిత్ వరుసగా రెండు బౌండరీలు బాది 229 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ వెంటనే ట్రావిస్ హెడ్ 164 బంతుల్లో 150 పరుగులు చేసుకున్నాడు.
కానీ ఈ జోడీని మహమ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్తో విడదీసాడు. షార్ట్ పిచ్ బాల్తో డెంజరస్ ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్తో 163)ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 285 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి కామెరూన్ గ్రీన్ రాగా.. మహమ్మద్ షమీ సూపర్ బౌలింగ్తో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
ప్లాన్ చేసి స్లిప్ క్యాచ్గా బోల్తా కొట్టించాడు. ఆ కొద్ది సేపటికే సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన డేంజరస్ స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121)ను శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఆసీస్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఆ తర్వాత అక్షర్ పటేల్ స్టన్నింగ్ త్రో మిచెల్ స్టార్క్ను పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ కమిన్స్తో కలిసి అలెక్స్ క్యారీ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించాడు. దాంతో ఆసీస్ 422/7 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.