న్యూఢిల్లీ: టీమిండియా కిట్ స్పాన్సర్ అడిడాస్ కొత్త జెర్సీలను ఆవిష్కరించింది. మూడు ఫార్మట్లకు చెందిన టీమిండియా జెర్సీ ఫొటోలను గురువారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మూడు ఫార్మాట్ల జెర్సీలకు సంబంధించిన వీడియోను అడిడాస్ కంపెనీ సోషల్ మీడియాలో పంచుకుంది. డ్రోన్స్ సాయంతో మైదానంలో నుంచి మూడు ఫార్మాట్ల జెర్సీలను పైకీ తీసుకొస్తున్నట్లుగా యానిమేటెడ్ వీడియోను రూపొందించారు.
నైక్ కంపెనీ తర్వాత కిట్ స్పాన్సర్ జెర్సీని తయారు చేయడం ఇది తొలిసారి. జూన్ 7-11 మధ్య లండన్లో ఓవల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఈ కొత్త జెర్సీలతో బరిలోకి దిగనుంది. ఇక కిట్ స్పాన్సర్గా అడిడాస్తో బీసీసీఐ ఐదేళ్ల పాటు రూ.350 కోట్లకు డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 2028 వరకు ఈ ఒప్పందం కొనసాగనుంది. ఎమ్పీఎల్ స్థానంలో అడిడాస్ ఈ ఒప్పందం చేర్చుకుంది. పురుషుల క్రికెట్తో పాటు మహిళలు, ఏజ్ గ్రూప్ క్రికెట్లోనూ భారత ఆటగాళ్లు ఈ జెర్సీలనే ధరించనున్నారు.

టెస్ట్ జెర్సీ షోల్డర్స్పై బ్లూ కలర్ లైన్స్ రాగా.. పరిమిత ఓవర్ల క్రికెట్ జెర్సీల్లో ఒకటి థిక్ బ్లూ ఉంటే మరొకటి లైట్ బ్లూ కలర్లో ఉంది. మూడు ప్రపంచకప్ గెలిచిన చిహ్నంగా కుడివైపు బీసీసీఐ చిహ్నంపై మూడు స్టార్లు ఉంచారు. ఎడమవైపు అడిడాస్ సింబల్ ఉంది. ఈ కొత్త జెర్సీలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అద్భుతంగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం టీమిండియాకు జెర్సీ స్పాన్సర్ లేదు. నవంబరు వరకు ఉన్న తమ కాంట్రాక్టును బైజూస్ రద్దు చేసుకుంది. ఇలా బైజూస్ అర్ధంతరంగా తప్పుకోవడంతో మరో కొత్త స్పాన్సర్ను పట్టుకోవడానికి బీసీసీఐ ప్రయత్నిస్తోంది. అయితే ఇకపై తక్కువ సమయానికి చిన్న కంపెనీలకు ఈ అవకాశం ఇవ్వకుండా.. ఎక్కువ కాలం నిలిచే డీల్స్ మాత్రమే చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే టూల్ కిట్ స్పాన్సర్షిప్ కోసం ఐదేళ్లపాటు అడిడాస్తో డీల్ చేసుకుంది.
ఇంతకాలం బీసీసీఐ స్పాన్సర్షిప్స్ ద్వారా ఒక్కో ఐసీసీ మ్యాచ్కు రూ.1.5 కోట్లు, ద్వైపాక్షిక అంతర్జాతీయ మ్యాచ్కు రూ.4.6 కోట్లు సంపాదించేది. అయితే ప్రస్తుత కాలంలో ఐసీసీ టోర్నీలకు ప్రాధాన్యం పెరిగిన సంగతి తెలిసిందే. ఏటా డబ్ల్యూటీసీ జరగనున్న నేపథ్యంలో.. వన్డే వరల్డ్ కప్ మొదలయ్యే సమయానికి మంచి స్పాన్సర్ లభిస్తారని బీసీసీఐ భావిస్తోంది.