హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ నేపథ్యంలో రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్లీ మైదానంలోకి బరిలోకి దిగనుంది. జూన్ 7-11 మధ్య లండన్లో ఓవల్ మైదానం వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. రెండేళ్ల పాటు జరిగిన ఈ మెగా టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టీమిండియా పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం టీమిండియాకుఇది వరుసగా రెండోసారి. డబ్ల్యూటీసీ 2019-21 అరంగేట్ర ఎడిషన్లో కూడా ఫైనల్ చేరిన టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైన టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే అప్పుడు టీమిండియా కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఉండగా.. ఈ సారి రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు.

ఇక ఫైనల్లో కెప్టెన్గా రోహిత్ శర్మకు తిరుగులేదు. అది ఐపీఎల్ అయినా..మరే టోర్నీ అయినా కెప్టెన్గా రోహిత్ శర్మకు ఓటమే తెలియదు. అత్యంత లక్కీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ.. డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి టీమిండియా కలను సాకారం చేస్తాడని, 10 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించుతాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్గా ఐదు సార్లు టైటిల్ గెలిచిన రోహిత్.. ఆటగాడిగా ఆరు సార్లు ఛాంపియన్గా నిలిచాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రోహిత్ శర్మ ఫైనల్ చేరిన ప్రతీసారి విజయమే దక్కింది. 2009లో డెక్కన్ చార్జర్స్ ప్లేయర్గా తొలిసారి ఐపీఎల్ టైటిల్ అందుకున్న రోహిత్.. 2013లో ముంబై ఇండియన్స్ సారథిగా ఎంపికయ్యాడు.
తొలి సీజన్లోనే జట్టును ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్.. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020 సీజన్లలోనూ టైటిళ్లు అందుకున్నాడు. 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ ఫైనల్లోనూ కెప్టెన్గా విజయాన్నందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో తాత్కలిక సారథిగా 2018 ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించి జట్టుకు ట్రోఫీ అందించిన రోహిత్.. అదే ఏడాది నిదహాస్ ట్రై సిరీస్ ఫైనల్లోనూ జట్టుకు విజయాన్నందించాడు.

కెప్టెన్గా తన కెరీర్లో 8 ఫైనల్స్ ఆడిన రోహిత్ శర్మ.. 8 సార్లు టైటిల్స్ గెలిచాడు. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా రోహిత్ విజయాన్నందకుంటాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యూటీసీ టైటిల్ గెలిస్తే ధోనీ తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన రెండో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డుకెక్కనున్నాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2021 డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడినా విజయాలు అందుకోలేకపోయింది.