హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను టీమిండియా పేలవంగా ప్రారంభించింది. ఆస్ట్రేలియాతో ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మెగా మ్యాచ్ తొలి రోజు ఆటలో రోహిత్ సేన తేలిపోయింది. ట్రావిస్ హెడ్(156 బంతుల్లో 22 ఫోర్లు, సిక్స్తో 146 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్(227 బంతుల్లో 14 ఫోర్లతో 95 బ్యాటింగ్) చెలరేగడంతో ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 327 పరుగులు చేసి మ్యాచ్పై పట్టు బిగించింది.
ఆసీస్ బ్యాటర్ల ధాటికి భారత బౌలర్లు తేలిపోయారు. ఏం చేయలేని నిస్సహాయతలో కనిపించారు. కనీస పోరాట పటిమ కూడా చూపించలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం చేతులెత్తేసాడు. అయితే తొలి రోజు ఆటలో టీమిండియాను మూడు తప్పిదాలు దెబ్బతీసాయి.

1. పిచ్ను సరిగ్గా అంచనా వేయకపోవడం..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం టీమిండియా కొంపముంచింది. పిచ్ను గ్రీన్ ట్రాక్గా సిద్దం చేయడం.. మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో బౌలింగ్కు అనుకూలిస్తుందని భావించిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ సెషన్లో పిచ్ బౌలింగ్కు అనుకూలించగా భారత బౌలర్లు అందిపుచ్చుకోలేకపోయారు.
సిరాజ్ ఒక్కడే ఆరంభంలో వికెట్ తీయగా మరో ఎండ్లో అతనికి అండగా ఎవరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా ఉమేశ్ యాదవ్ పేలవ బౌలింగ్తో ఆసీస్ బ్యాటర్లకు ఊపిరి అందించాడు. ఆ తర్వాత మైదానంలో ఎండకొట్టగా పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారింది.
2. అశ్విన్ను పక్కనపెట్టడం..
ఓవల్ పిచ్ పూర్తిగా పేస్ బౌలింగ్కు అనుకూలిస్తోందని భావించిన టీమిండియా.. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను కాదని ఉమేశ్ యాదవ్తో బరిలోకి దిగింది. కానీ రెండో సెషన్ తర్వాత అశ్విన్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. పేసర్లంతా విఫలమవడం.. జడేజా ప్రభావం చూపకపోవడంతో ఆసీస్ బ్యాటర్లు స్వేచ్చగా ఆడారు.
మరోవైపు అశ్విన్ను తీసుకోకపోవడం టీమిండియా చేసిన ఘోర తప్పిదమని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అశ్విన్ను తీసుకొని ఉంటే స్మిత్తో పాటు లెఫ్టాండ్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడేవారని పాంటింగ్ వంటి క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. పిచ్తో సంబంధం లేకుండా అశ్విన్లాంటి ప్లేయర్ను ఆడించాలని సునీల్ గవాస్కర్ అన్నాడు.
3.చేతులెత్తేయడం..
టెస్ట్ ఫార్మాట్ ఐదు రోజుల పాటు సాగే ఆట అని టీమిండియా ఆటగాళ్లు మరిచిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సెకండ్ సెషన్లో ఆసీస్ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించడంతో భారత ఆటగాళ్లు చేతులెత్తేసారు. బౌలర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తీవ్ర ఒత్తిడిలో కనిపించాడు. ప్రత్యర్థి బ్యాటింగ్కు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ఏం చేయలేదు. ఓటమికి తల ఒంచినట్లే ప్రవర్తించారు. భారత ఆటగాళ్లలో ఆ దూకుడు కనిపించలేదు.
ఆసీస్ బ్యాటర్లకు తగ్గట్లు టీమిండియా మేనేజ్మెంట్ కూడా సరైన హోమ్ వర్క్ చేయలేదు. కనీసం వారి బలహీనతలను కూడా గుర్తించలేకపోయారు.