సౌతాఫ్రికా గడ్డపై టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ ఘోర పరాజయం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో టీమిండియా అగ్రస్థానం కోల్పోయేలా చేసింది.
ఈ మ్యాచ్కు ముందు వరకు డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగింది. కానీ ఈ మ్యాచ్లో ఎదురైన ఘోర పరాజయంతో టీమిండియా ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం టీమిండియా విజయాల శాతం 44.44గానే ఉంది. భారత్పై భారీ విజయం సాధించిన సౌతాఫ్రికా 100 విజయాల శాతంతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

చివరకు పాకిస్థాన్ సైతం భారత్ కంటే మెరుగైన స్థానంలో నిలిచింది. 61.11 విన్నింగ్ పర్సంటేజీతో రెండో స్థానంలో నిలిచింది. భారత్ కంటే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ముందున్నాయి.
డబ్ల్యూటీసీ టోర్నీ ప్రవేశపెట్టిన తర్వాత రెండు సార్లు ఫైనల్ చేరిన టీమిండియా.. తృటిలో టైటిల్ చేజార్చుకుంది. తొలి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా.. ఈ ఏడాది జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఖంగుతిన్నది.
డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్
ర్యాంక్ టీమ్ పీసీటీ
1 సౌతాఫ్రికా 100
2 పాకిస్థాన్ 61.11
3 న్యూజిలాండ్ 50
4 బంగ్లాదేశ్ 50
5 భారత్ 44.44
6 ఆస్ట్రేలియా 41.67
7 వెస్టిండీస్ 16.67
8 ఇంగ్లండ్ 15
9 శ్రీలంక 0
మూడు రోజుల్లోనే ముగిసిన బాక్సింగ్ డే టెస్ట్లో.. 63 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 131 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(82 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 76) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కోహ్లీ, శుభ్మన్ గిల్(26) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబడాకు రెండు వికెట్లు దక్కాయి. 256/5 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 108.4 ఓవర్లలో 408 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ డీన్ ఎల్గర్(287 బంతుల్లో 28 ఫోర్లతో 185) భారీ శతకానికి తోడుగా.. టెయిలెండర్ మార్కో జాన్సెన్(147 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 84 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు.