న్యూఢిల్లీ: ఓవైపు యావత్ భారత్ ఐపీఎల్ మత్తులో తెలియాడుతుంటే.. మరోవైపు అంతర్జాతీయ వేదికపై తమ ఆటతో మువ్వెన్నల జెండాను రెపరెపలాడించిన రెజ్లర్లు న్యాయం కోసం దేశం నడిబొడ్డున పోరాడుతున్నారు. తమను లైంగికంగా వేధించిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ను అరెస్ట్ చేయాలనే డిమాండ్తో గత నెల పదిహేను రోజులుగా రెజర్లర్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే వారి ఆందోళనలను ఎవరూ పట్టించుకోకపోవడం.. ఇతర క్రీడాకారుల నుంచి కనీస మద్దతు కూడా లభించకపోవడంతో భారత స్టార్ రెజ్లర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము దేశం కోసం సాధించిన పతకాలను గంగలో పడేస్తామని హెచ్చరించారు. ఇందు కోసం రెజ్లర్లంతా హరిద్వార్ చేరుకున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని చెప్పిన రెజ్లర్లు.. ఇండియా గేట్ వద్ద నిరహార దీక్షకు చేపడుతామని ప్రకటించారు.

ఈ మేరకు స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ట్వీట్ చేసింది. 'ఈ మెడల్సే మా ప్రాణం. ఇవే మా సర్వస్వం. వీటిని మేం గంగలో పడేస్తాం. వీటిని గంలో వేసిన తర్వాత మా బతుకు అర్థం ఉండదు. కాబట్టి ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతాం.'అని సాక్షి మాలిక్ హిందీలో ట్వీట్ చేసింది.
ప్లేయర్లంతా తమ మెడల్స్తో హరిద్వార్ చేరుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రెండ్రోజుల క్రితం పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా.. రెజర్లు అటు వైపు మార్చ్ తీసే ప్రయత్నం చేయగా.. పోలీసులు ఈడ్చేశారు. వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా వంటి రెజ్లర్లను పోలీసులు.. ఈడ్చుకెళ్తూ పోలీసు వాహనాల్లో ఎక్కించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.
కాగా ఇన్నాళ్లు జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లకు ఇక నుంచి అక్కడ అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు. జంతర్ మంతర్ తప్పా మరెక్కడైనా తమ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని వెల్లడించారు. ఇది రెజ్లర్లలో మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలో రెజ్లర్లు.. తమకు వచ్చిన ఒలింపిక్, ప్రపంచస్థాయి టోర్నమెంట్, ఇతర టోర్నీలలో వచ్చిన పతకాలను గంగలో పడేయాలని నిర్ణయించుకున్నారు.