
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో అరెస్టయిన ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ను మండోలి జైలు నుంచి తీహార్ జైలుకు తరలించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్కుమార్తో పాటు అతని సహచరుడు అజయ్ను మే 23న ఢిల్లీ స్పెషల్ పోలీసులు దేశ రాజధానిలోని ముండ్కా ప్రాంతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాలతో సుశీల్ను తిహార్ జైలు-2కు తరలించినట్లు తెలుస్తోంది. కాగా, జైలు అధికారులు మాత్రం సాధారణ ప్రక్రియలో భాగంగానే తరలింపు జరిగిందని పేర్కొన్నారు.
అయితే సుశీల్ కుమార్ను తీహార్ జైలుకు తరలించే క్రమంలో పోలీసులు ఈ ఒలింపిక్ మెడల్ విన్నర్తో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫొటోలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సుశీల్కు మద్దతుగా మాట్లాడుతుంటే మరికొందరు మాత్రం వ్యతిరేకంగా స్పందిస్తున్నారు.
ఇక ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద మే 4న యువ రెజ్లర్ సాగర్ రాణాతో పాటు అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్పై సుశీల్ కుమార్, అతని స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. తీవ్ర గాయాలైన సాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడి అనంతరం పరారీలో ఉన్న సుశీల్ కుమార్తో పాటు సహ నిందితుడు అజయ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో సుశీల్ జూడో కోచ్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సుశీల్ కుమార్ బేస్బాల్ బ్యాట్తో రాణాపై దాడి చేసిన వీడియోలు, ఫొటోలు నెట్టింట హల్చల్ చేశాయి. దాంతో సుశీల్ చుట్టూ ఈ కేసు ఉచ్చు బిగుసుకుంది. ఓ ఫ్లాట్ విషయంలోని గొడవ ఈ హత్యకు దారితీసిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకేసుతో భారత్కు రెండు పతకాలు అందించిన సుశీల్ కుమార్ ప్రతిష్ట మసకబారింది. నార్త్ సెంట్రల్ రైల్వేలోని అతని ఉద్యోగం కూడా పోయింది.