న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ప్రారంభానికి ముందే అనూహ్య స్పందన లభిస్తోంది. ఐపీఎల్ తరహాలోనే మహిళా క్రికెట్లో క్రేజ్ను సొంతం చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగమయ్యేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక డబ్ల్యూపీఎల్కు సంబంధించిన మొట్టమొదటి వేలం ముంబై వేదికగా ఫిబ్రవరి 13న నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. అయితే ఈ మెగా వేలంలో పాల్గొనేందుకు 1000 మంది మహిళా క్రికెటర్లు తమ పేర్లను రిజిష్టర్ చేసుకున్నట్లు క్రిక్బజ్ పేర్కొంది.
'ఫస్ట్ ఎడిషన్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఆడేందుకు చాలా మంది క్రికెటర్లు ఆసక్తిగా ఉన్నారు. ఐపీఎల్ వేలం కోసం ఇప్పటికే 1000 మంది వరకు అమ్మాయిలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో భారత్తో పాటు విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు" అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించినట్లు తెలిపింది. తొలి సీజన్లో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. ఒక్కో ప్రాంఛైజీకి 18 మంది క్రికెటర్లను కొనుగోలు చేసుకోనేందుకు బీసీసీఐ అనుమతించింది. అంటే మొత్తంగా 90 మంది మాత్రమే ఈ వేలంలో అమ్ముడుపోతారు. 1000 మంది నుంచి ఐదు ఫ్రాంచైజీలు షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంది.
ఐదు జట్ల మధ్య జరగనున్న డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్లో మొత్తం 22 మ్యాచ్లు జరగనున్నాయి. మ్యాచ్లన్నీ ముంబైలోని బార్బోర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. లీగ్ మార్చి తొలి వారంలో ప్రారంభమై చివరి వారంలో ముగిసే అవకాశం ఉంది. ఐదు జట్ల విక్రయాల ద్వారా బీసీసీఐకి రూ.4,669.99 కోట్లు రాగా.. వచ్చే ఐదేళ్ల మీడియా రైట్స్ను రిలయన్స్కు చెందిన వయాకామ్ సంస్థ రూ.951 కోట్లకు కొనుగోలు చేసింది.
అహ్మదాబాద్, మంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో బేస్ ఫ్రాంచైజీల కోసం మొత్తం 30 కంపెనీలు పోటీపడగా.. అత్యధిక ధరను బిడ్ వేసిన ఆదాని గ్రూప్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, కాప్రి గ్లోబల్ సంస్థలు మహిళా ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి.