వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2026 సీజన్ మెగా వేలానికి రంగం సిద్దమైంది. ఈ మెగా వేలం నవంబర్ 27న జరగనుంది. ఐదు ఫ్రాంచైజీల ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. రిటెన్షన్ రూల్స్ ప్రకారం.. గరిష్టంగా ముగ్గురు భారత క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు ఫారిన్ ప్లేయర్లు, ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వేలం పర్స్ వాల్యూను రూ.15 కోట్లుగా నిర్ణయించారు.
రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో తొలి ప్లేయర్కు రూ.3.5 కోట్లు, రెండో ప్లేయర్కు రూ. 2.5 కోట్లు, మూడో ప్లేయర్కు రూ. 1.75 కోట్లు, నాలుగో ప్లేయర్కు రూ. 1 కోటి, ఐదో ప్లేయర్కు రూ.50 లక్షల ధరను బీసీసీఐ నిర్ణయించింది. గత మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ రెండు సార్లు టైటిల్ గెలవగా.. ఆర్సీబీ ఒకసారి గెలిచింది.

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమకు కలిసొచ్చే ఆటగాళ్లను రిటైన్ చేసుకొని అవసరం లేని ఆటగాళ్లను వేలంలోకి వదిలేసాయి. ఈ ఐదు ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలను అధికారిక బ్రాడ్కాస్టర్ జియో హాట్స్టార్ గురువారం వెల్లడించింది. ముంబై, ఆర్సీబీ, ఢిల్లీ ఐదుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. యూపీ ఒకే ఒక్క ప్లేయర్ను అంటిపెట్టుకుంది. గుజరాత్ జెయింట్స్ ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.
డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో తెలుగు తేజం, ప్రపంచకప్ విన్నర్ శ్రీచరణి పంట పండనుంది. గత సీజన్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి రిటైన్ చేసుకోలేదు. ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉండటంతో జెమీమా రోడ్రిగ్స్(రూ.2.2 కోట్లు), షెఫాలీ వర్మ(రూ. 2.2 కోట్లు), నికీ ప్రసాద్(రూ.50 లక్షలు)లను మాత్రమే అంటిపెట్టుకుంది. ఈ ముగ్గురితో పాటు మారిజానే కాప్(రూ.2.2 కోట్లు), అన్నబెల్ సదర్లాండ్(రూ.2.2 కోట్లు)లను తీసుకుంది. దాంతో ఆర్టీమ్ అవకాశం కూడా ఢిల్లీకి లేకుండా పోయింది.
గత సీజన్లో రూ. 50 లక్షలకు శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేయగా..రెండు మ్యాచ్ల్లోనే ఆమెకు అవకాశం దక్కింది. ఈ రెండు మ్యాచ్ల్లో శ్రీ చరణి 4 వికెట్లు తీసింది. ఈ ప్రదర్శనతోనే టీమిండియాకు ఆడే అవకాశం అందుకున్న శ్రీచరణి ఏకంగా.. మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఎంపికైంది.
ఈ టోర్నీలో 21 ఏళ్ల శ్రీ చరణి అదరగొట్టింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ఈ ఆంధ్రా అమ్మాయి 9 మ్యాచ్ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. ఈ 9 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్లో వికెట్ తీసింది. ముఖ్యంగా సెమీస్, ఫైనల్లో ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ టీమిండియా విజయానికి బాటలు వేసింది. ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచింది. ఈ ప్రదర్శన నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలంలో శ్రీచరణి భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. రూ. కోటి నుంచి రూ. 2 కోట్ల ధర ఈజీగా పలుకుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.