రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఆ జట్టును వీడనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ షేర్ చేసిన పోస్ట్ ఈ సందేహాలకు కారణమైంది. శనివారం(నవంబర్ 1) కన్నడ రాజ్యోత్సవం పురస్కరించుకొని ఆర్సీబీ ఒక వీడియోను షేర్ చేసింది. ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లంతా ఒక్కొక్కరిగా వచ్చి కన్నడ రాజ్యోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పటీదార్, శ్రేయాంక పాటిల్, దేవదత్ పడిక్కల్, టీమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జితేష్ శర్మ కర్ణాటక ప్రజలకు రాష్ట్ర ఏర్పాటు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల టీమ్ నుంచి శ్రేయాంక పాటిల్ మాత్రమే విషెస్ చెప్పడంతో కెప్టెన్ స్మృతి మంధాన జట్టును వీడుతుందనే సందేహాలు మొదలయ్యాయి.

కానీ స్మృతి మంధాన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీతో బిజీగా ఉంది. దాంతోనే ఆమె ఆర్సీబీ ఫ్రాంచైజీకి అందుబాటులోకి రాలేదనే విషయం అర్థమవుతుంది. స్మృతి మంధానతో పాటు మరే ఇతర ఆర్సీబీ మహిళా క్రికెటర్ కూడా ఈ వీడియోలో కనిపించలేదని, ప్రధాన ఆటగాళ్లంతా ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్నారని ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గాయంతో భారత జట్టుకు దూరమైన శ్రేయాంక పాటిల్ ఖాళీగా ఉండటంతోనే ఈ వీడియో చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఆర్సీబీకి కోహ్లీ ఎంతనో.. స్మృతి మంధాన కూడా అంతేనని, ఆమె ఎప్పుడూ ఈ జట్టుతోనే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో అసాధారణ ప్రదర్శనతో టీమిండియా ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా 52 ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది. దేశంలో మహిళల క్రికెట్కు మరింత ఆదరణ పెరగనుంది.
దేశంలోని రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా కన్నడ మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కర్ణాటక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. బొంబాయి, మంద్రాసు, హైదరాబాద్ ప్రెసిడెన్సీలో ఉన్న ప్రాంతాలను కర్ణాటక రాష్ట్రంలో కలిపేసారు. 1956 నవంబర్ 1న రాష్ట్ర ఏర్పాటు దినోత్సవంగా ప్రకటించారు. మొదట్లో మైసూరు రాష్ట్రం అని పేరు పెట్టారు. కానీ 1973 నవంబర్ 1న రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కర్ణాటకగా మార్చారు. అప్పటి నుంచి నవంబర్ 1ని కన్నడ రాజ్యోత్సవంగా అక్కడి ప్రజలు జరుపుకుంటారు. ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ దినోత్సవాన్ని జరుపుతుంది. కర్ణాటక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ.. కూడా కన్నడ రాజ్యోత్సవంలో భాగమైంది.