RCB: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో రెండో టైటిల్ ముద్దాడింది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్తో వడోదర వేదికగా జరిగిన ఫైనల్లో కెప్టెన్ స్మృతి మంధాన, జార్జియో వాల్ అసాధారణ ప్రదర్శనతో 6 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. 204 పరుగుల టార్గెట్ను ఛేదించి.. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్నిఅందుకున్న జట్టుగా ఆర్సీబీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్కు మరోసారి నిరాశే ఎదురైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమీమా(37 బంతుల్లో 8 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీ సాధించగా.. లారా వోల్వర్డ్ట్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 44), చినెల్ హెన్రీ(15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 35 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో సయాలీ సత్ఘరే(1/46), అరుంధతి రెడ్డి(1/40), నదినే డీ క్లెర్క్(1/48) తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసి గెలుపొందింది. జార్జియో వాల్(54 బంతుల్లో 14 ఫోర్లతో 79), స్మృతి మంధాన(41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 87) విధ్వంసకర బ్యాటింగ్తో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో చినెల్ హెన్రీ(2/34) రెండు వికెట్లు తీయగా.. నందని శర్మ, మిన్ను చెరో వికెట్ పడగొట్టారు. తెలుగు తేజం శ్రీ చరణి(0/46) తీవ్రంగా నిరాశపర్చింది. ఓవరాల్గా ఆర్సీబీకి ఇది మూడో టైటిల్ కాగా.. వరుసగా రెండో ట్రోఫీ.

204 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆశించిన ఆరంభం దక్కలేదు. చినెల్ హెన్రీ వేసిన రెండో ఓవర్లోనే ఓపెనర్ గ్రేస్ హ్యారీస్(9) క్లీన్ బౌల్డ్ అయ్యింది. క్రీజులోకి వచ్చిన జార్జియో వాల్.. కెప్టెన్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్ను చక్కబెట్టింది. మంధాన ఆచితూచి ఆడినా వాల్ తనదైన షాట్లతో చెలరేగింది. దాంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం మంధాన కూడా బ్యాట్ ఝులిపించడంతో ఆర్సీబీ 10 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది.
ఈ క్రమంలో జార్జియో వాల్ 37 బంతుల్లో 9 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ వెంటనే స్మృతి మంధాన 23 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో అర్థ శతకాన్ని అందుకుంది. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని విడదీసేందుకు ఢిల్లీ కెప్టెన్ జెమీమా చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. బౌలర్లు మార్చినా.. ఫిల్డ్ సెటప్ చేంజ్ చేసినా ఫలితం లేకపోయింది.
ప్రతీ ఢిల్లీ బౌలర్ను ఈ జోడీ బౌండరీలతో శిక్షించింది. స్మృతి, వాల్ పోటా పడి బౌండరీలు బాదడంతో ఢిల్లీ ఫీల్డర్లు చూస్తూ నిలబడిపోయారు. జార్జియో వాల్ను మిన్ను మణి క్యాచ్ ఔట్ చేయడంతో రెండో వికెట్కు నమోదైన 165 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక భాగస్వామ్యం. క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ బౌండరీ బాది క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది.
19వ ఓవర్ వేసిన చినెల్ హెన్రీ.. స్మృతి మంధానను ఔట్ చేసి మ్యాచ్ను ఉత్కంఠగా మార్చింది. ఆఖరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 10 పరుగులు అవసరం కాగా.. శ్రీ చరణి బౌలింగ్లో తొలి రెండు బంతుల్లో సింగిల్స్ రాగా.. మూడో బంతికి బౌండరీ వచ్చింది. దాంతో చివరి 3 బంతుల్లో 4 పరుగులు అవసరం కాగా.. రాధా యాదవ్ బౌండరీ బాది ఆర్సీబీ విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.