వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్లోనూ స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ విజయం సాధించింది. సోమవారం వడోదర వేదికగా గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 61 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. బ్యాటింగ్లో గౌతమి నాయక్(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 73) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. బౌలింగ్లో సయాలి సత్ఘరే(3/21) మూడు వికెట్లతో గుజరాత్ జెయింట్స్ పతనాన్ని శాసించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్ గ్రేస్ హ్యారీస్(1)తో పాటు జార్జియో వోల్(1) నిరాశపర్చగా.. కెప్టెన్ స్మృతి మంధాన(26) తక్కువ స్కోర్కే వెనుదిరిగినా.. గౌతమి నాయక్తో కలిసి మూడో వికెట్కు 60 పరుగులు జోడించింది. అనంతరం రిచా ఘోష్తో కలిసి గౌతమి నాయక్ చెలరేగింది. ఈ క్రమంలో 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. నాలుగో వికెట్కు 70 పరుగులు జోడించిన అనంతరం రిచా ఔటవ్వగా.. సెంచరీ దిశగా సాగిన గౌతమీ నాయక్ను అష్లే గార్డ్నర్ ఔట్ చేసింది. చివర్లో రాధా యాదవ్(17) దూకుడుగా ఆడి భారీ స్కోర్ అందించగా.. నదినే డిక్లెర్క్(4 నాటౌట్), శ్రేయాంక పాటిల్(8 నాటౌట్) ఆమెకు అండగా నిలిచారు.

అనంతరం గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 117 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ అష్లే గార్డ్నర్(43 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 54) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇతర బ్యాటర్లు అయిన బెత్ మూనీ(3), సోఫీ డివైన్(0), అనుష్క శర్మ(18), కనిక అహుజా(0), కాశ్వీ గౌతమ్(4), జార్జియో వేర్హామ్(2), భార్టి కన్వార్(14)ల వైఫల్యం గుజరాత్ జెయింట్స్ ఓటమిని శాసించింది. ఆర్సీబీ బౌలర్లలో సయాలి సత్ఘరే(3/21)తో పాటు నదినే డి క్లేర్క్(2/17) రెండు వికెట్లు తీయగా.. లారెన్ బెల్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ తీసారు.
ఐదు మ్యాచ్లకు ఐదు గెలిచిన ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో మూడు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. టేబుల్ టాపర్గా నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. రెండు మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతాయనే సంగతి తెలిసిందే. ఆర్సీబీ ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆర్సీబీకి ఫైనల్ బెర్త్ ఖరారు అవుతుంది.