భారత మహిళల తదుపరి కెప్టెన్గా జెమీమా రోడ్రిగ్స్ను నియమించాలని సౌతాఫ్రికా క్రికెటర్ మరిజన్నే కాప్ సూచించింది. హర్మన్ప్రీత్ కౌర్కు సరైన వారసురాలు జెమీమానేనని అభిప్రాయపడింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్గా నియమించింది. గత మూడు సీజన్లలో మెగ్ లాన్నింగ్ ఢిల్లీని నడిపించగా.. ఈసారి ఆమె యూపీ వారియర్స్కు వెళ్లిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
దేశవాళీ క్రికెట్లో ముంబై మహిళల జట్టుకు జెమీమా సారథ్యం వహిస్తుంది. అయితే ఆమె ఇప్పటి వరకు భారత జట్టుతో పాటు డబ్ల్యూపీఎల్లో సారథిగా పనిచేయలేదు. అయినా జెమీమాలో సారథ్య లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఆమె సహచర ఢిల్లీ ప్లేయర్ అయిన మరిజన్నే కాప్ చెప్పుకొచ్చింది.
'జెమీమా రోడ్రిగ్స్ను భారత తదుపరి కెప్టెన్గా నియమించాలని నేను రెండేళ్ల క్రితమే చెప్పాను. ఆమెలో సారథ్య లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె వ్యక్తిత్వం, అందరినీ కలుపుకొనిపోయే తీరు, ఇతరుల పట్ల చూపించే శ్రద్ద కెప్టెన్గా నిలబెడుతాయి. ఎంతో అనుభవం ఉన్న కెప్టెన్లు కూడా కొన్నిసార్లు సవాళ్లను ఎదుర్కొంటారు. జెమీమా చుట్టూ ఇప్పుడు చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. ఆమె ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటుందని నేను భావిస్తున్నాను.

మెగ్ లానింగ్ను కోల్పోవడం కచ్చితంగా ఢిల్లీకి అతిపెద్ద దెబ్బనే. ఆమె కేవలం ఢిల్లీ క్యాపిటల్స్కే కాదు. ప్రపంచ క్రికెట్లోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్.'అని క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిజన్నే కాప్ చెప్పుకొచ్చింది. మెగ్ లాన్నింగ్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు సీజన్లలో టేబుల్ టాపర్గా నిలిచి ఫైనల్ చేరింది. కానీ తృటిలో టైటిల్ కోల్పోయింది.
ఐదు సార్లు ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్గా.. డబ్ల్యూపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్గా గుర్తింపు పొందింది. జనవరి 9 నుంచి డబ్ల్యూపీఎల్ 2026 సీజన్కు తెరలేవనుండగా.. జనవరి 10న ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.