వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్యూపీఎల్) 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఐదు జట్లు దాదాపు ఐదేసి లీగ్ మ్యాచ్లు ఆడాయి. ఈ ఐదు మ్యాచ్లకు ఐదు గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఐదు మ్యాచ్ల్లో రెండు గెలిచి ముంబై ఇండియన్స్ మెరుగైన రన్రేట్తో రెండో స్థానంలో నిలిచింది.
యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ రెండేసి విజయాలతో మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఒకే ఒక్క విజయంతో అట్టడుగు స్థానంలో ఉంది. దాంతో ప్లే ఆఫ్స్ సమరం ఆసక్తికరంగా మారింది.
డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం లీగ్ దశ మ్యాచ్లు ముగిసే సరికి పాయింట్స్ టేబుల్లో టాప్-3లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. అగ్రస్థానంలో నిలిచే జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతాయి. ఇందులో గెలిచిన జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తోంది.

ప్రస్తుతం ఐదు మ్యాచ్ల్లో రెండేసి విజయాలతో రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ తమ తదుపరి మూడు మ్యాచ్లకు మూడు గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఒకవేల ఒక మ్యాచ్లో ఓడి మరో రెండు గెలిస్తే.. ఆ జట్టు ఖాతాలో 8 పాయింట్స్ చేరుతాయి. అప్పుడు యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అప్పుడు నెట్ రన్రేట్ కీలకం అవుతుంది. చివరి మూడు మ్యాచ్ల్లో ఒక్కటి మాత్రమే గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ నేరుగా ఫైనల్ చేరడం కష్టం. అద్భుతం జరిగితే తప్పా ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ చివరి మూడు మ్యాచ్లకు మూడు గెలిచినా.. గరిష్టంగా 10 పాయింట్లు మాత్రమే సాధించగలదు. ఆర్సీబీ ఐదు మ్యాచ్లకు ఐదు గెలిచి 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు తమ చివరి మూడు మ్యాచ్లకు మూడింటిని ఘోరంగా ఓడిపోవడంతో పాటు ముంబై ఇండియన్స్ మెరుగైన రన్రేట్తో గెలవాలి. ఇతర జట్లు కూడా 10 పాయింట్స్ సాధించవద్దు. అప్పుడే ముంబై ఇండియన్స్ నేరుగా ఫైనల్ చేరగలదు. ఇలా జరగడం అసాధ్యం. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకొని ఎలిమినేటర్లో విజయం సాధిస్తేనే ముంబైకి ఫైనల్ బెర్త్ దక్కుతుంది.
జనవరి 20: vs ఢిల్లీ క్యాపిటల్స్ (వడోదర)
జనవరి 26: vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (వడోదర)
జనవరి 30: vs గుజరాత్ జెయింట్స్ (వడోదర)