WPL 2026 Final: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో వడోదర వేదికగా జరుగుతున్న ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది.
'మేం ఈరోజు ముందుగా ఫీల్డింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ టోర్నీలో ఇది ఒక ట్రెండ్గా మారింది. పిచ్ బాగున్నప్పుడు.. మనం ఎంత స్కోరును ఛేజ్ చేయాలో తెలియడం ఎప్పుడూ మంచిదే. గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే మేం బరిలోకి దిగుతున్నాం.
ఫైనల్ చేరడం అద్భుతమైన అనుభూతి. ఈ మ్యాచ్కు ముందు మాకు మంచి విరామం లభించింది. మొదటి 2-3 రోజులు మేం క్రికెట్ గురించి పెద్దగా ఆలోచించకుండా సరదాగా గడిపాం. గత రెండు మూడు రోజులుగా మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టి నెట్స్లో శ్రమించాం. ఫైనల్ అంటే సహజంగానే కొంచెం ఒత్తిడి, ఆందోళన, ఉత్సాహం ఉంటాయి. వాటన్నింటినీ మనం స్వీకరించాలని జట్టులో చర్చించుకున్నాం. ఒత్తిడికి భయపడకుండా వాటిని ఆస్వాదించాలి.
ఫైనల్ కోసం ప్రత్యేకంగా ఏం ప్రిపేర్ కాలేదు. సాధ్యమైనంత వరకు విషయాలను సింపుల్గా ఉంచుకోవడం మాకు బాగా కలిసొచ్చింది. ఈరోజు కూడా అదే పద్ధతిని అనుసరిస్తాం. ఈ రోజు అందరూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ అందరిలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. కచ్చితంగా మేం మైదానంలో అత్యుత్తమ క్రికెట్ ఆడాలి.'అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.

మరోవైపు ఇలాంటి పెద్ద మ్యాచ్ల్లో టాస్ ఓడిపోవడమే ఉత్తమమని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడిగ్స్ తెలిపింది. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేయాలనుకున్నామని, కానీ ముందుగా బ్యాటింగ్ చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. 'ఇలాంటి పెద్ద మ్యాచ్ల్లో టాస్ ఓడిపోవడమే మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు అది మనకే మేలు చేస్తుంది. ఒకవేళ మేం టాస్ గెలిచినా ముందుగా బౌలింగ్నే ఎంచుకునేవాళ్ళం. కానీ బ్యాటింగ్ చేయడం పట్ల కూడా సంతోషంగానే ఉన్నాం. మేం మా విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నాం.
ఫైనల్ గురించి అతిగా ఆలోచించలేదు. మా ప్రణాళికలపై స్పష్టతతో ఉన్నాం. మాకు కలిసొచ్చే విషయం ఏంటంటే.. ఎలిమినేటర్ ఆడిన పిచ్పైనే ఆడుతున్నాం. కాబట్టి పిచ్ గురించి మాకు బాగా తెలుసు. ఈ ఫైనల్కు అన్ని విధాల సిద్దంగా ఉన్నాం.'అని జెమీమా చెప్పుకొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగో సారి ఫైనల్ చేరగా.. ఆర్సీబీ రెండో సారి ఫైనల్కు అర్హత సాధించింది. గత మూడు సీజన్లలో చేజారిన టైటిల్ను ఈసారి అందుకోవాలనే పట్టుదలతో జెమీమా సేన ఉండగా.. రెండో టైటిల్ చేజిక్కించుకోవాలని స్మృతి టీమ్ భావిస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్: లిజెల్ లీ (కీపర్), షెఫాలీ వర్మ, లారా వోల్వార్డ్ట్, జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మరిజన్నే కాప్, చినెల్ హెన్రీ, నికి ప్రసాద్, స్నేహ రాణా, మిన్ను మణి, శ్రీ చరణి, నందని శర్మ.
ఆర్సీబీ: గ్రేస్ హారిస్, స్మృతి మంధాన (కెప్టెన్), జార్జియా వోల్, రిచా ఘోష్ (కీపర్), రాధా యాదవ్, నడిన్ డి క్లర్క్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్ఘరే, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్.