వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్లో ఆర్సీబీకి మరో పరాజయం ఎదురైంది. యూపీ వారియర్స్తో సోమవారం సూపర్ ఓవర్కు దారి తీసిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమిపాలైంది. 9 పరుగుల లక్ష్యంతో సూపర్ ఓవర్లో బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 4 పరుగులే చేసింది. సోఫీ ఎక్లీస్టోన్ సూపర్ బౌలింగ్తో యూపీ వారియర్స్ సంచలన విజయాన్నందుకుంది.
డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇదే తొలి సూపర్ ఓవర్ కాగా.. యూపీ వారియర్స్ విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఎల్లిస్ పెర్రీని సూపర్ ఓవర్లో బ్యాటింగ్ పంపించకపోవడం ఆర్సీబీ కొంపముంచింది. ఈ మ్యాచ్లో ఎల్లిస్ పెర్రీతో పాటు డానీ వ్యాట్ను సూపర్ ఓవర్లో బ్యాటింగ్ పంపించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఆర్సీబీ బౌలర్ కిమ్ గార్త్ వేసిన సూపర్ ఓవర్లో యూపీ వారియర్స్ వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఎల్లిస్ పెర్రీ(56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 90 నాటౌట్), డానీ వ్యాట్-హోడ్జే(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరూ మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ స్మృతి మంధాన(6), రిచా ఘోష్(8), కనిక అహుజ(5), జార్జియ వేర్హామ్(7) తీవ్రంగా నిరాశపరిచారు. యూపీ బౌలర్లలో హెన్రీ, దీప్తి శర్మ, తహిల మెక్గ్రాత్ తలో వికెట్ తీసారు.
అనంతరం యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 180 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. శ్వేత సెహ్రావత్(25 బంతుల్లో 4 ఫోర్లతో 31), సోఫీ ఎక్లీస్టోన్(19 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో ఎక్లీస్టోన్తో పాటు సైమా థకోర్ సిక్సర్లతో స్కోర్లు టై అయ్యాయి. ఆర్సీబీ బౌలర్లలో రేణుక సింగ్, కిమ్ గార్త్ రెండేసి వికెట్లు తీయగా.. స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టింది. ఎల్లిస్ పెర్రీకి ఓ వికెట్ దక్కింది. ఆర్సీబీ వరుసగా ఇది రెండో పరాజయం. ముంబై ఇండియన్స్తో జరిగిన గత మ్యాచ్లోనూ ఆర్సీబీ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది.