రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానులను ఉద్దేశించి ఆ ఫ్రాంచైజీ మహిళా టీమ్ కెప్టెన్ స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్సీబీ అభిమానులు డైహార్డ్ ఫ్యాన్స్ అని, వారికి ప్రేమ, కోపం రెండు ఎక్కువేనని తెలిపారు. బాగా ఆడితే వారే ప్రశంసిస్తారని, విఫలమైతే మాత్రం గట్టిగానే విమర్శిస్తారని అభిప్రాయపడ్డారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్కు రంగం సిద్దమైంది.
శుక్రవారం ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుండగా.. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో మాట్లాడిన స్మృతి మంధాన ఆర్సీబీ ఫ్యాన్ బేస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'బయట ఏం జరుగుతుందనేది మాకు అనవసరం. టీమ్గా క్వాలిటీ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. ఆర్సీబీకి ఫ్యాన్స్ బేస్ భారీ స్థాయిలో ఉంటుంది. మిగతా జట్లతో పోల్చితే మాపై వచ్చే ప్రశంసలు, విమర్శలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇలా ఉండటం వల్ల మైదానంలో సమష్టిగా పోరాడుతాం. ఎక్కడికెళ్లినా అభిమానులు ఆర్సీబీ అంటూ గట్టిగా నినాదాలు చేయడం బాగుంటుంది. వారి స్లోగన్స్ను మేం పాజిటీవ్గా తీసుకుంటాం.
డబ్ల్యూపీఎల్ వేలం తర్వాత మా జట్టులోని ఆటగాళ్లు చాలా మంది గాయపడ్డారు. దాంతోనే గత సీజన్ విన్నింగ్ టీమ్లోని చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోయారు. మా ఆల్రౌండర్ సోఫీ డివైన్ లేకపోవడం మాకు తీవ్రమైన లోటే. గత పదేళ్లుగా ఆమె అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణించింది. అయితే ఆమె నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. ఆటగాళ్లకు గాయాలు కావడంపై ఇప్పటికే జట్టులో చర్చించాం. అయినా, మా బ్రాండ్ క్రికెట్ను ఆడేందుకు ప్రయత్నిస్తాం. మెరుగైన ప్రదర్శన చేసి టైటిల్ నిలబెట్టుకునేందుకు పోరాడుతాం.'అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.