రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మహిళా టీమ్ కెప్టెన్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) చరిత్రలోనే రెండు సార్లు 80 ప్లస్ స్కోర్ చేసిన బ్యాటర్గా నిలిచింది. 2022లో డబ్ల్యూపీఎల్ ప్రారంభమవ్వగా.. ఇప్పటి వరకు 10 సార్లు మాత్రమే 80కి పైగా వ్యక్తిగత స్కోర్లు నమోదు అయ్యాయి. ఇందులో స్మృతి మంధాన మాత్రమే రెండు సార్లు 80 ప్లస్ రన్స్ చేసింది. మరే ప్లేయర్ కూడా ఇప్పటి వరకు రెండుసార్లు 80 ప్లస్ స్కోర్స్ చేయలేదు.
డబ్ల్యూపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో స్మృతి మంధాన(47 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 81) విధ్వంసకర హాఫ్ సెంచరీతో ఈ ఫీట్ సాధించింది. గత సీజన్లో యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో స్మృతి మంధాన 50 బంతుల్లో 80 పరుగులు చేసింది. ఢిల్లీతో చేసిన 81 పరుగులే ఈ లీగ్లో మంధానకు అత్యధిక వ్యక్తిగత స్కోర్.

డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డ్ సోఫీ డివైన్ పేరిట ఉంది. డబ్ల్యూపీఎల్ 2023 సీజన్లో ఆమె 36 బంతుల్లో 99 పరుగులు చేసింది. ఆ తర్వాత అలీసా హీలీ(96 నాటౌట్), హర్మన్ ప్రీత్ కౌర్(95 నాటౌట్), తహిలా మెక్గ్రాత్(90 నాటౌట్), దీప్తి శర్మ(88 నాటౌట్), బెత్ మూనీ(85 నాటౌట్), షెఫాలీ వర్మ(84), స్మృతి మాంధా(81), నాట్ సివర్ బ్రంట్(80 నాటౌట్), స్మృతి మంధాన(80) కొనసాగుతున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. జెమీమా రోడ్రిగ్స్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 34) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో రేణుక సింగ్(3/23), జార్జియ వేర్హమ్(3/25) మూడేసి వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, ఎక్త్ బిష్త్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ.. 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 146 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన(47 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 81) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. మరో ఓపెనర్ డానీ వ్యాట్-హోడ్జ్(33 బంతుల్లో 7 ఫోర్లతో 42) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. విజయం ముంగిట ఓపెనర్లు ఔటవ్వగా..ఎల్లిస్ పెర్రీ( 7 నాటౌట్), రిచా ఘోష్( 11 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. రిచా ఘోష్ భారీ సిక్సర్తో మ్యాచ్ను ముగించడం విశేషం.