వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ జెయింట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్ల సమష్టి ప్రదర్శనతో పాటు షెఫాలీ వర్మ, జెస్ జోనాసెన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయస విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. భార్తీ ఫుల్మాలి(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 40 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. డియాండ్ర డాటిన్(24 బంతుల్లో 5 ఫోర్లతో 26) పర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే, మరిజన్నే కాప్, అన్నబెల్ సదర్లాండ్ రెండేసి వికెట్లు తీయగా.. టిటస్ సదు, జెస్ జోనాస్సెన్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 15.1 ఓవర్లలోనే 4 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. జెస్ జోనాస్సెన్(32 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 61 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. షెఫాలీ వర్మ(27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 44)దూకుడుగా ఆడింది. గుజరాత్ బౌలర్లలో కేశ్వీ గౌతమ్ రెండు వికెట్లు తీయగా.. అష్లే గార్డ్నర్, తనూజ కన్వార్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఆ జట్టు మూడు విజయాలు సాధించింది. మరో రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. డబ్ల్యూపీఎల్ ఫార్మాట్ ప్రకారం ప్రతీ జట్టు తమ ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్ల చొప్పున మొత్తం 8 లీగ్ మ్యాచ్లు ఆడనుంది. టాప్లో నిలిచే జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. 2, 3 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో గెలిచిన టీమ్ ఫైనల్కు అర్హత సాధిస్తోంది.