వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని చేధించి సంచలన విజయాన్నందుకున్న ఆర్సీబీ.. రెండో మ్యాచ్లోనూ అదే ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు రేణుక సింగ్(3/23), జార్జియ వేర్హమ్(3/25) రఫ్ఫాడించారు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. జెమీమా రోడ్రిగ్స్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 34) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రేణుక, జార్జియతో పాటు కిమ్ గార్త్, ఎక్త్ బిష్త్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలో గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(0)ను రేణుక సింగ్ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చింది. మరో ఓపెనర్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్తో కలిసి జెమీమాతో దూకుడుగా ఆడింది. మెగ్ లాన్నింగ్ కూడా బౌండరీలు బాదడంతో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి ఢిల్లీ 55 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రేణుక విడదీసింది.
జెమీమాను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి రెండో వికెట్కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరదించింది.
సదర్లాండ్ ఆచితూచి ఆడగా.. మెగ్ లాన్నింగ్ను కిమ్ గార్త్ పెవిలియన్ చేర్చింది. సదర్లాండ్(19)ను రేణుక ఔట్ చేయగా.. జెస్ జోనాస్సెన్(0) బిష్త్ పెవిలియన్ చేర్చింది. మరిజన్నే కామ్, సరా బ్రైస్, రాధా యాదవ్, తెలుగు తేజం అరుంధతి రెడ్డి(4)లు తీవ్రంగా నిరాశపర్చడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది.