వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్లో భాగంగా గుజరాత్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్లు నిప్పులు చెరిగారు. హీలీ మాథ్యూస్(3/16) మూడు వికెట్లు తీయగా.. నాట్ సీవర్ బ్రంట్(2/26), అమెలియా కేర్(2/22) రెండేసి వికెట్లు పడగొట్టారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది.
హర్లీన్ డియోల్(31 బంతుల్లో 4 ఫోర్లతో 32), కేశ్వీ గౌతమ్(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20) టాప్ స్కోరర్గా నిలవగా..మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్, నాట్ సీవర్, అమెలియా కేర్తో పాటు షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్జోత్ కౌర్ తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జెయింట్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. వరుస ఓవర్లలో ఆ జట్టు టాప్-3 బ్యాటర్లు బెత్ మూనీ(1), లౌరా వోల్వార్డ్(4), దయాలన్ హేమలత(9) పెవిలియన్ చేరారు. ఆ కాసేపటికే కెప్టెన్ అష్లే గార్డ్నర్(10)కూడా ఔటవ్వడంతో పవర్ ప్లేలోనే గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి 28 పరుగులే చేసింది. హర్లీన్ డియోల్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేయగా.. డియోండ్ర డాటిన్(7)ను అమెలియా కేర్ పెవిలియన్ చేర్చడంతో గుజరాత్ 43 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో 2 ఫోర్లు, సిక్స్ బాది కేశ్వీ గౌతమ్ ఆశలు రేకెత్తించింది. కానీ ఆమె జోరు ఎంతో సేపు కొనసాగలేదు. హీలీ మాథ్యూస్ ఔట్ చేయడంతో గుజరాత్ పతనం కొనసాగింది. సిమ్రాన్ షేక్(3)ను మాథ్యూస్ ఔట్ చేయగా.. తనుజా కన్వర్తో కలిసి హర్లీన్ డియోల్ జట్టు స్కోర్ను 100 పరుగులను ధాటించింది. ధాటిగా ఆడే క్రమంలో డియోల్ ఔటవ్వడంతో గుజరాత్ పతనం మొదలైంది. తనూజ కన్వార్, ప్రియా మిశ్రా కూడా ఔటవ్వడంతో ఆఖరి బంతికి గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది.