వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్ను ఘనంగా ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అనూహ్యంగా చతికిలపడింది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. బ్యాటింగ్ విభాగం మొత్తం ఎల్లిస్ పెర్రీ మీద ఆధారపడటం.. కెప్టెన్ స్మృతి మంధాన, రిచా ఘోష్ దారుణంగా విఫలమవ్వడం ఆర్సీబీ కొంపముంచుతోంది.
ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లతో ఆర్సీబీ తృటిలో విజయాలను చేజార్చుకుంది. యూపీ వారియర్స్తో సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను టై చేసుకున్న ఆర్సీబీ.. సూపర్ ఓవర్లో ఓటమిపాలైంది. కెప్టెన్గా మంధాన తీసుకుంటున్న నిర్ణయాలు జట్టుకు నష్టం చేస్తున్నాయి. గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన గత రెండు మ్యాచ్ల్లో ఆర్సీబీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

చివరి 2 మ్యాచ్లు గెలిచినా..?
ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 2 విజయాలు నమోదు చేసి -0.244 రన్రేట్తో పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో ఆర్సీబీ మరో రెండు మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. యూపీ వారియర్స్తో శనివారం, ముంబై ఇండియన్స్తో మార్చి 11న తలపడనుంది. ఈ రెండు మ్యాచ్లు గెలిచినా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కే అవకాశాలు లేవు. యూపీ, ముంబై, గుజరాత్ మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ జట్టు చివరి రెండు మ్యాచ్లు గెలవడంతో పాటు రన్రేట్ను మెరుగుపరుచుకోవాల్సి ఉంది. ఒక్క మ్యాచ్ ఓడినా.. ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతవుతాయి.
ఢిల్లీ బెర్త్ ఖాయం..
ఏడు మ్యాచ్ల్లో ఐదు విజయాలు నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అయ్యింది. 6 మ్యాచ్లు ఆడి మూడేసి విజయాలు సాధించి గుజరాత్, ముంబై రెండు,మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. లీగ్ దశ ముగిసిన తర్వాత టాప్-3లో నిలిచే జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ ఆడుతోంది.