వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై 9 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్న ముంబై ఇండియన్స్.. ఫైనల్ బెర్త్పై కన్నేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(33 బంతుల్లో 9 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. నాట్ సీవర్ బ్రంట్(31 బంతుల్లో 6 ఫోర్లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడింది. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో తనూజ కన్వార్, కేశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, అష్లే గార్డ్నర్ తలో వికెట్ తీసారు.

అనంతరం గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో ముంబై గెలిచినా.. గుజరాత్ బ్యాటర్ భార్తీ పుల్మాలీ(25 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 61) పోరాటం అందర్నీ ఆకట్టుకుంది. ఆమెకు మరే బ్యాటర్ సహకరించకపోవడంతోనే గుజరాత్ విజయం సాధించలేకపోయింది. ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి 13 పరుగులు అవసరమవ్వగా.. హేలీ మాథ్యూస్ అసాధారణ బౌలింగ్తో గుజరాత్ను ఆలౌట్ చేసింది. దాంతో ముంబై విజయం లాంఛనమైంది. హీలీ మాథ్యూస్(3/38)తో పాటు అమెలియా కేర్(3/34) మూడు వికెట్లు పడగొట్టింది. షబ్నిమ్ ఇస్మాయిల్(2/17) రెండు వికెట్లు తీయగా.. సాన్స్క్రిట్ గుప్తా(1/18) ఒక వికెట్ తీసింది.
ముంబై ఫైనల్ చేరాలంటే..?
పాయింట్స్ టేబుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్ల్లో 5 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే అగ్రస్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ను దక్కించుకుంటుంది. డబ్ల్యూపీఎల్ లీగ్ ఫార్మాట్ ప్రకారం లీగ దశ ముగిసే సరికి టాప్-3లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయి.
టాప్లో ఉన్న టీమ్ నేరుగా ఫైనల్కు అర్హత సాధించనుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచే జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతాయి. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోగా.. యూపీ వారియర్స్, డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ముంబై X ఆర్సీబీ మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ ఫలితంతో ఫైనల్ చేరే జట్టు ఏదో తేలనుంది. ఈ మ్యాచ్లో ముంబై గెలిస్తే ఫైనల్ బెర్త్ దక్కుతోంది. ఓడితే మాత్రం ఢిల్లీ ఫైనల్ చేరుతోంది.