వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఆ జట్టు నాలుగో ఓటమిని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన ఏకపక్ష మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ గెలుపుతో టేబుల్ టాపర్గా ఢిల్లీ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకోగా.. ఆర్సీబీ తమ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఎల్లిస్ పెర్రీ(47 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 60 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. రగ్వి బిస్త్(32 బంతుల్లో 2 సిక్స్లతో 33) పర్వాలేదనిపించింది. కెప్టెన్ స్మృతి మందాన(8), రిచా ఘోష్(5), కనిక అహుజ(2) మరోసారి దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో జెస్ జోనాస్సెన్(2/24), శ్రీ చరణి(2/28) రెండేసి వికెట్లు తీయగా.. మరిజన్నే కాప్ ఓ వికెట్ పడగొట్టింది.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 15.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 151 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్(2) విఫలమైనా.. షెఫాలీ వర్మ (43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 80 నాటౌట్), జెస్ జోనాస్సెన్(38 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆర్సీబీ బౌలర్లలో రేణుక సింగ్ ఏకైక వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ ఎల్లిస్ పెర్నీ మెరిసినా ఫలితం లేకపోయింది.
తాజా పరాజయంతో నాలుగో స్థానానికి పడిపోయిన ఆర్సీబీ.. చివరి రెండు లీగ్ మ్యాచ్ల్లో గెలిచినా.. ప్లేఆఫ్స్ చేరే పరిస్థితి లేదు. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. డబ్ల్యూపీఎల్లో మొత్తం 5 జట్లు తలపడనుండగా.. లీగ్ దశలో ప్రతీ జట్టు తమ ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ లెక్కన ప్రతీ టీమ్ లీగ్ దశలో 8 మ్యాచ్లు ఆడనుంది. లీగ్ దశలో టాప్-3 టీమ్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించనున్నాయి. టాప్ టీమ్ నేరుగా ఫైనల్ చేరనుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.