వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ అష్లే గార్డ్నర్(37 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్లతో 79 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగింది. ఆమెతో పాటు బెత్ మూనీ(42 బంతుల్లో 8 ఫోర్లతో 56) కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. డియోండ్ర డాటిన్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 25) మెరుపులు మెరిపించింది. ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు తీయగా.. కనిక అహుజ, జార్జియ వేర్హమ్, ప్రేమ రావత్ తలో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జెయింట్స్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ లౌరా వోల్వార్డ్(6)ను రేణుక సింగ్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ వెంటనే దయలన్ హేమలత(4)ను అహుజా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చింది. ఈ పరిస్థితుల్లో బెత్ మూనీతో కలిసి అష్లే గార్డ్నర్ చెలరేగింది. విధ్వంకర బ్యాటింగ్తో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ క్రమంలో బెత్ మూనీ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. అష్లే గార్డ్నర్ 25 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసింది.

అనంతరం మరింత ధాటిగా ఆడిన అష్లే గార్డ్నర్ వేగంగా పరుగులు రాబట్టింది. బెత్ మూనీని ప్రేమ రావత్ ఔట్ చేసినా.. డియాండ్ర డాటిన్తో కలిసి గార్డ్నర్ ఇన్నింగ్స్ కొనసాగించింది. డియోండ్ర డాటిన్ను రేణుక సింగ్ ఔట్ చేయడంతో నాలుగో వికెట్కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సిమ్రాన్ షేక్ విఫలమైనా.. హర్లీన్ డియోల్తో కలిసి అష్లే గార్డ్నర్ జట్టు స్కోర్ను 200 ధాటించింది.