వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరుకు బ్రేక్ పడింది. వరుసగా రెండు విజయాల తర్వాత ఆ జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. ముంబై ఇండియన్స్తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఈ పోరులో ముంబై ఒక్క బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. చివర్లో ఆర్సీబీ బౌలర్ కనిక అహుజ(0/28) చెత్త బౌలింగ్ ఆ జట్టు పతనాన్ని శాసించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఎల్లిస్ పెర్రీ(43 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 81) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రిచా ఘోష్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28), స్మృతి మంధాన(13 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 26) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో అమన్జోత్ కౌర్(3/22) మూడు వికెట్లు తీయగా.. షబ్నిమ్ ఇస్మైల్, నాట్ సీవర్ బ్రంట్, హీలీ మాథ్యూస్, సాంస్క్రిట్ గుప్తా తలో వికెట్ తీసారు.

అనంతరం ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(38 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. నాట్ సీవర్ బ్రంట్(21 బంతుల్లో 9 ఫోర్లతో 42), అమన్జోత్ కౌర్(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆర్సీబీ బౌలర్లలో జార్జియా వేర్హామ్(3/21) మూడు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్(2/30) రెండు వికెట్లు తీసాడు.
ముంబై విజయానికి 12 బంతుల్లో 22 పరుగులు అవసరం కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆర్సీబీనే గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ కనిక అహుజా వేసిన 19వ ఓవర్లో అమన్జోత్ కౌర్ తొలి బంతి, ఆఖరి బంతి సిక్స్లు బాది 16 పరుగులు పిండుకుంది. దాంతో ఆఖరి ఓవర్లో ముంబైకి 6 పరుగులే అవసరమయ్యాయి. ఎక్తా బిస్త్ ఆఖరి ఓవర్లో నాలుగు బంతులను కట్టుదిట్టంగా వేసి 4 పరుగులే ఇచ్చింది. కానీ ఐదో బంతిని బౌండరీకి తరలించిన కమలిని విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.
A superb chase as Mumbai Indians secure their 2️⃣nd win in a row! 🙌 🙌
— Women's Premier League (WPL) (@wplt20) February 21, 2025
The Harmanpreet Kaur-led unit bag 2️⃣ points as they beat #RCB by 4 wickets! 👏 👏
Scorecard ▶ https://t.co/WIQXj6JCt2 #TATAWPL | #RCBvMI | @mipaltan pic.twitter.com/NfA75uQzK3