వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్లో వరుస విజయాలతో జోరు కనబర్చిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్కు యూపీ వారియర్స్ షాకిచ్చింది. బెంగళూరు వేదికగా బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన యూపీ వారియర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది.
ఈ మ్యాచ్కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ దూరంగా ఉండగా.. నాట్ సీవర్ బ్రంట్ సారథ్యంలో బరిలోకి దిగిన ఆ జట్టు ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులే చేసింది. హీలీ మాథ్యూస్(47 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

యస్తికా భాటియా(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 26) పర్వాలేదనిపించింది. యూపీ బౌలర్లలో తెలుగు తేజం అంజలి శార్వాణి, గ్రేస్ హరీస్, సోఫీ ఎకిల్స్టోన్, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన యూపీ వారియర్స్ 16.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 163 పరుగులు చేసి గెలుపొందింది. కిరణ్ నావ్గిరే(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీ సాధించగా.. అలీసా హీలీ(29 బంతుల్లో 5 ఫోర్లతో 33) , గ్రేస్ హారీస్(17 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 38 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో అమెలియా కేర్ ఓ వికెట్ తీయగా.. ఇస్సీ వాంగ్ రెండు వికెట్లు పడగొట్టింది.
ఈ సీజన్లో యూపీ వారియర్స్కు ఇదే తొలి విజయం కాగా ముంబై ఇండియన్స్కు తొలి పరాజయం. గత రెండు మ్యాచ్ల్లో ముంబై విజయం సాధించింది.