వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్లో యూపీ వారియర్స్ మరో విజయాన్నందుకుంది. గుజరాత్ జెయింట్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన యూపీ వారియర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. గ్రేస్ హ్యారిస్ విధ్వంసకర బ్యాటింగ్తో గుజరాత్ జెయింట్స్ చిత్తయ్యింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేసింది. ఫోబే లిట్చీఫీల్డ్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 35), యాష్లే గార్డ్నర్(17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 30) టాప్ స్కోరర్లుగా నిలవగా.. లౌరా వోల్వార్డ్(28) విలువైన పరుగులు చేసింది. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎక్క్లేస్టోన్(3/20) మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వర్ గైక్వాడ్ ఓ వికెట్ పడగొట్టింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన యూపీ వారియర్స్ 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 143 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. గ్రేస్ హ్యారీస్(33 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 60 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. అలీసా హీలీ(21 బంతుల్లో 7 ఫోర్లతో 33) మెరుపులు మెరిపించింది. కిరణ్ నావ్గిర్(12), చమరి ఆటపట్టు(17), శ్వేత సెహ్రావత్(2) విఫలమైనా... దీప్తి శర్మ(14 బంతుల్లో 3 ఫోర్లతో 17 నాటౌట్) కలిసి గ్రేస్ హ్యారీస్ విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.
గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో తనూజా కన్వార్ రెండు వికెట్లు తీయగా.. కత్రిన్ బ్రైస్, మేఘనా సింగ్ తలో వికెట్ తీసారు. ఈ సీజన్ యూపీ వారియర్స్కు ఇది రెండో విజయం కాగా.. గుజరాత్ జెయింట్స్కు హ్యాట్రిక్ పరాజయం.