వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్లో భాగంగా గుజరాత్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మ్యాచ్కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ పరాషర్ జోషి టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను తలపించాడు. దాంతో ఆయన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ అంపైర్గా వ్యవహరిస్తున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మనిషిని పోలిన మనుష్యులు ఏడుగురు ఉంటారని, అయ్యర్ను పోలిన వ్యక్తి డబ్ల్యూపీఎల్ అంపైర్గా కొనసాగుతున్నాడని కామెంట్ చేస్తున్నారు. పరాషర్ జోషీ తన కెరీర్లో 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లకు, 17 లిస్ట్ ఏ మ్యాచ్లకు, 14 టీ20లకు ఫీల్డ్ అంపైర్గా బాధ్యతల నిర్వర్తించాడు. ఓ లిస్ట్ ఏ మ్యాచ్కు టీవీ అంపైర్గా వ్యవహరించాడు.

ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులే చేసింది. దయాలన హేమలత(25 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31), హర్లీన్ డియోల్(31 బంతుల్లో 3 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో సోఫీ మోలినక్స్(3/25) మూడు వికెట్లు తీయగా.. రేణుక సింగ్(2/14) రెండు వికెట్లు పడగొట్టింది. జార్జియో వేర్హమ్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ.. స్మృతి మంధాన(27 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 43) మెరుపు బ్యాటింగ్తో విజయం దిశగా దూసుకెళ్తోంది. సోఫీ డివైన్(6) విఫలమైనా.. సబ్బినేని మేఘన(21 బ్యాటింగ్) సాయంతో ఆర్సీబీకి శుభారంభం అందించింది.