వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రతీ జట్టు ఏడేసి మ్యాచ్లు పూర్తి చేసుకోగా.. గుజరాత్ జెయింట్స్ మాత్రం 6 మ్యాచ్లే ఆడింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 5 విజయాలతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ముంబై ఇండియన్స్ కూడా 5 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది.
ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరుకున్నాయి. లీగ్ దశ ముగిసిన తర్వాత అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధించనుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచి జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి జట్టు ఫైనల్లో తలపడనుంది. ఇప్పటికే రెండు జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకోగా.. మూడో స్థానం కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి.

ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ చేతిలో ఓడిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. ముంబై ఇండియన్స్తో జరిగే ఆఖరి మ్యాచ్లో మెరుగైన రన్రేట్తో విజయం సాధించాలి. మరోవైపు యూపీ వారియర్స్.. గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలవ్వాలి. ఒకవేళ యూపీ, ఆర్సీబీ విజయం సాధిస్తే మెరుగైన రన్రేట్ ఉన్న జట్టు టోర్నీలో ముందడుగు వేస్తోంది.

ప్రస్తుతం ఆర్సీబీ రన్రేట్ మెరుగ్గా ఉంది. యూపీ వారియర్స్ క్వాలిఫై కావాలంటే ముంబై చేతిలో ఆర్సీబీ ఓడిపోవాలి. గుజరాత్ జెయింట్స్పై యూపీ విజయం సాధించాలి. గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే మాత్రం ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్ల్లో విజయం సాధించాలి. అది కూడా మెరుగైన రన్రేట్తో గెలిస్తే ఆ జట్టుకు అవకాశం ఉంటుంది. ఆ జట్టు యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్తో తమ చివరి లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది.