ప్రతీ ఏటా జాతరలా సాగే భారతీయ క్రికెట్ పండుగకు రంగం సిద్దమైంది. వరల్డ్ బెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 సీజన్కు ముందు టీజర్లా అమ్మాయిల ఐపీఎల్ అలరించేందుకు ముస్తాబైంది. ధనాధన్ బ్యాటింగ్తో పాటు నిప్పులు చెరిగే బౌలింగ్, కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు వీక్షించే సమయం ఆసన్నమైంది. మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్కు నేడే(శుక్రవారం) తెరలేవనుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్తో డబ్ల్యూపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. గతేడాది మాదిరే మొత్తం ఐదు ఫ్రాంచైజీలు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. ముంబై, ఢిల్లీతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ ఈ సీజన్ కోసం సిద్దమయ్యాయి.

స్టార్ క్రికెటర్లతో..
అరంగేట్ర సీజన్లో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని బలహీనతలను అధిగమించి బలంగా తయారయ్యాయి. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, శిఖా పాండే, రేణుక సింగ్ లాంటి స్టార్లతో శ్రేయాంక పాటిల్, మిన్ను మణి వంటి యువ క్రికెటర్లూ సత్తా చాటేందుకు సిద్దమయ్యారు.
మరోవైపు మెగ్ లానింగ్, ఎలీస్ పెర్రీ, సోపీ డివైన్, అలీసా హీలీ, చమరి ఆటపట్టు, బెత్మూనీ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఈ లీగ్లో తమ పవర్ ఏంటో చూపించేందుకు రెడీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి స్నేహ దీప్తి, అరుంధతి రెడ్డి, త్రిష పూజిత, షబ్నం, సబ్బినేని మేఘన, యషశ్రీ, అంజలి, గౌహర్ సుల్తానా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు.
రెండు నగరాల్లో..
గతేడాది ముంబైకే పరిమితమైన డబ్ల్యూపీఎల్.. ఈ సారి రెండు నగరాల్లో ఆతిథ్యం ఇవ్వనుంది. ముంబైలోని డీవై పాటిల్, బ్రబౌర్న్ మైదానాల్లో అరంగేట్ర సీజన్ జరగ్గా.. ఈ సారి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం ఆతిథ్యం ఇవ్వనున్నాయి. బెంగళూరు వేదికగా 11 మ్యాచ్లు.. ఢిల్లీ వేదికగా మరో 11 మ్యాచ్లను షెడ్యూల్ చేశారు. మార్చి 17న జరిగే ఫైనల్తో ఈ సీజన్కు తెరపడనుంది.
బాలీవుడ్ బాద్షా..
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ కోసం బీసీసీఐ ఆరంభ వేడుకలను ప్లాన్ చేసింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్ర, కార్తీక్ ఆర్యన్ సందడి చేయనున్నారు. ఈ వేడుకల సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుండగా.. మ్యాచ్లు ఆన్నీ జియో సినిమా, స్పోర్ట్స్ 18లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి.