వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు శుభారంభం చేసింది. యూపీ వారియర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్లో రాధా యాదవ్(4/20), మరిజన్నే కాప్(3/5) నిప్పులు చెరగగా.. బ్యాటింగ్లో షెఫాలీ వర్మ(43 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 64 నాటౌట్), మెగ్ లాన్నింగ్(43 బంతుల్లో 6 ఫోర్లతో 51) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయస విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 119 పరుగులే చేసింది. శ్వేత సెహ్రావత్(42 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 45) మినహా అంతా విఫలమయ్యారు. కెప్టెన్ అలిసా హీలీ(13), తహిళా మెక్గ్రాత్(17), దీప్తి శర్మ(5) తీవ్రంగా నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్ 4 వికెట్లు తీయగా.. మరిజన్నే కేప్ మూడు, అరుంధతి రెడ్డి, అన్నబెల్ సదర్లాండ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ 14.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 123 పరుగులు చేసి గెలుపొందింది. జెమీమా రోడ్రిగ్స్(4 నాటౌట్) బౌండరీతో విజయలాంఛాన్ని పూర్తి చేసింది. సోఫీ ఎక్లేస్టోన్కు ఓ వికెట్ దక్కింది. ఈ సీజన్లో ఢిల్లీకి ఇది తొలి విజయం కాగా.. యూపీ వారియర్స్కు వరుసగా రెండో పరాజయం.