వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రెండు వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు విజయం సాధించింది. యూపీ వారియర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో ఆర్సీబీకి ఇది మూడో విజయం కాగా.. యూపీ వారియర్స్కు మూడో ఓటమి.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన(50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 80), ఎల్లిస్ పెర్రీ(37 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 58)హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో రిచా ఘోష్(10 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించింది. యూపీ బౌలర్లలో తెలుగు తేజం అంజలి శర్వాణి, దీప్తి శర్మ, సోఫీ ఎక్లేస్టోన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ అలీస్సా హీలీ(38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. దీప్తి శర్మ(22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33), పూనమ్ ఖేమ్నర్(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 31) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ చేధించాల్సి లక్ష్యం ఎక్కువగా ఉండటంతో ఒత్తిడికి గురై వికెట్ పారేసుకున్నారు.
ఆర్సీబీ బౌలర్లలో సోఫీ డివైన్, సోఫీ మోలినక్స్, జార్జియో వేర్హమ్, అషా సోభాన తలో రెండు వికెట్లు తీసారు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో మూడో స్థానం చేరగా.. యూపీ వారియర్స్ నాలుగో స్థానానికి పడిపోయింది.
డీఆర్ఎస్ వివాదం..
ఈ మ్యాచ్లో యూపీ వారియర్స్ బ్యాటర్ చమరి ఆటపట్టు(8) ఔటైన తీరు వివాదాస్పదమైంది. ఆర్సీబీ బౌలర్ వేర్హమ్ బౌలింగ్లో ఆటపట్టు ఎల్బీగా వెనుదిరిగింది. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వకపోవడంతో ఆర్సీబీ రివ్యూ ద్వారా ఫలితాన్ని రాబట్టింది.
లెగ్ స్పిన్నర్ వేర్హమ్ ఫుల్ లెంగ్త్లో వేయగా.. బ్యాట్ను మిస్సైన బంతి ఆటపట్టు ప్యాడ్లను తాకింది. వెంటనే ఆర్సీబీ ప్లేయర్లు అప్పీల్ చేయగా..బంతి లెగ్సైడ్ వెళ్లినట్లు కనిపించడంతో అంపైర్ నాటౌటిచ్చాడు. దాంతో ఆర్సీబీ రివ్యూ తీసుకోగా.. బాల్ ట్రాకింగ్లో బంతి వికెట్లను తాకుతున్నట్లు కనిపించింది. దాంతో అంపైర్తో పాటు ఆటపట్టు, హీలీ షాకయ్యారు.
కానీ ఏం చేయలేకపోయారు. టెక్నాలజీ తప్పిదం కారణంగా ఆటపట్టు బలైందన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్లో జోరూట్ కూడా ఇలానే టెక్నాలజీ తప్పిదం కారణంగా బలయ్యాడు. ఈ వ్యవహారంపై ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.