వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. సోమవారం యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన గుజరాత్ జెయింట్స్.. 8 పరుగుల తేడాతో గెలుపొందింది.
కెప్టెన్ బెత్ మూనీ(42 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 74 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.ముఖ్యంగా చివరి 6 బంతుల్లో 5 బౌండరీలు బాది జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించింది. ఈ 5 బౌండరీలే ఆ జట్టు విజయానికి కారణమయ్యాయి.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. బెత్ మూనీతో పాటు లౌరా వోల్వార్డ్(30 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 43) రాణించింది. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్(3/38) మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ(2/22) రెండు వికెట్లు పడగొట్టింది.
రాజేశ్వరి గైక్వాడ్, చమరి ఆటపట్టుకు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసి ఓటమిపాలైంది. దీప్తి శర్మ(60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 88 నాటౌట్), పూనమ్ ఖెన్మర్(36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 36 నాటౌట్) చేసిన పోరాటం వృథా అయ్యింది.
35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టు ఈ ఇద్దరూ ఆదుకున్నారు. ఆరో వికెట్కు అజేయంగా 109 పరుగులు జోడించారు. చేయాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండటంతో విజయాన్ని అందుకోలేకపోయారు.

షబ్నమ్ మూడు వికెట్లతో చెలరేగడంతో యూపీ టాపార్డర్ కుప్పకూలింది. అష్లే గార్డ్నర్, కత్రిన్ బిర్స్ తలో వికెట్ తీసారు. యూపీ బ్యాటర్లలో కెప్టెన్ అలిస్సా హీలీ(4), కిరణ్ నావిగిరే(0), చమరి ఆటపట్టు(0), గ్రేస్ హ్యారీస్(1), శ్వేత సెహ్రావత్(1) దారుణంగా విఫలమయ్యారు.
ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన గుజరాత్ జెయింట్స్ రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే చివరి లీగ్ మ్యాచ్లో మెరుగైన రన్రేట్తో విజయం సాధించడంతో పాటు ముంబై ఇండియన్స్తో జరిగే తమ ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీ చిత్తుగా ఓడితేనే గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ చేరుతోంది.
ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. లీగ్ దశ ముగిసిన తర్వాత అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధించనుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచి జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి జట్టు ఫైనల్లో తలపడనుంది.