రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆల్రౌండర్ ఎల్లిస్ పెర్రీ చరిత్ర సృష్టించింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) చరిత్రలోనే 6 వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్గా నిలిచింది. డబ్ల్యూపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఎల్లిస్ పెర్రీ ఈ ఫీట్ సాధించింది. ఆమె సంచలన ప్రదర్శనతో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది.
ఈ మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఎల్లిస్ పెర్రీ 16 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె వేసిన తొలి 9 బంతుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. తర్వాతి 15 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టింది. ఇందులో నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్ ద్వారా రాగా.. రెండు ఎల్బీగా వచ్చాయి.

ఈ ప్రదర్శనపై ఎల్లిస్ పెర్రీ సంతోషం వ్యక్తం చేసింది. 'ఈ ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చింది. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. గత మూడేళ్లుగా నా బౌలింగ్ను మెరుగుపరుచుకోవడంపై ఫోకస్ పెట్టాను. సరైన లెంగ్త్లో బౌలింగ్ చేసి వికెట్లు తీసాను. గత మూడు మ్యాచ్లు చాలా త్వరగా ముగిసాయి. రిచా ఘోష్తో కీలక భాగస్వామ్యం నెలకొల్పడం సంతోషంగా ఉంది. పరిస్థితులకు తగ్గట్లు మేం బ్యాటింగ్ చేశాం. మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాను. 'అని చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై.. ఎల్లిస్ పెర్రీ(6/15) ధాటికి 19 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. హీలీ మాథ్యూస్(26), సజీవన్ సజన(30), ప్రియాంక బాలా(19 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఆర్సీబీ బౌలర్లలో ఎల్లిస్ పెర్రీతో పాటు సోఫీ మోలినెక్స్, ఆషా సోభనా, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆర్సీబీ 15 ఓవర్లలోనే 3 వికెట్లకు 115 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన(11), సోఫీ మోలినక్స్(9), సోఫీ డివైన్(4) విఫలమైనా.. ఎల్లిస్ పెర్రీ(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40 నాటౌట్), రిచా ఘోష్(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36 నాటౌట్) సత్తా చాటారు. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, హీలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్ తలో వికెట్ తీసారు.