వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరుకు బ్రేక్ పడింది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్పై కన్నేసిన ఆర్సీబీకి ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. సమష్టిగా రాణించి 25 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. అలిస్ క్యాప్సీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో మరిజన్నే కాప్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 32), జెస్ జొనాస్సెన్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36 నాటౌట్)మెరుపులు మెరిపించారు.

ఆర్సీబీ బౌలర్లలో నడిన్ డి క్లర్క్, సోఫీ డివైన్ రెండేసి వికెట్లు తీయగా.. శ్రేయాంక పాటిల్ ఓ వికెట్ పడగొట్టింది. అనంతర లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 169 పరుగులు చేసి ఓటమిపాలైంది. స్మృతి మంధాన(43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 74) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగినా.. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.
ఢిల్లీ బౌలర్లలో మరిజన్నే కేప్, తెలుగు తేజం అరుంధతి రెడ్డి రెండేసి వికెట్లు తీయగా.. జెస్ జోనాస్సెన్ మూడు వికెట్లు పడగొట్టింది. శిఖా పాండేకు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్కు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ ఎల్లిస్ పెర్రీ దూరంగా ఉంది. అనారోగ్యం కారణంగా ఆమె ఈ మ్యాచ్కు దూరమైందని టాస్ సందర్భంగా కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. ఎల్లిస్ పెర్రీ లేని లోటు ఈ మ్యాచ్లో కనిపించింది.