వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2023 సీజన్లో యూపీ వారియర్స్ సంచలన విజయాన్ని అందుకుంది. శుక్రవారం సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించిన లోస్కోరింగ్ గేమ్లో యూపీ వారియర్స్ 1 పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఆఖరి ఓవర్లో గ్రేస్ హారీస్ ఒక రనౌట్తో వరుసగా 3 వికెట్లు తీసి ఓడిపోయే మ్యాచ్లో యూపీ వారియర్స్ను గెలిపించింది.
డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యంత గొప్ప మ్యాచ్గా ఇది నిలిచిపోనుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. దీప్తి శర్మ(48 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 59) హాఫ్ సెంచరీతో రాణించగా.. అలీస్సా హీలీ(30 బంతుల్లో 5 ఫోర్లతో 29) పర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

ఢిల్లీ బౌలర్లలో టిటాస్ సధు, రాధా యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. శిఖా పాండే, అరుంధతి రెడ్డి, జెస్ జొనాస్సెన్, అలిస్ కేప్సీ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్(46 బంతుల్లో 12 ఫోర్లతో 60) ఒక్కతే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. యూపీ వారియర్స్ బౌలర్లలో దీప్తి శర్మ(4/19) నాలుగు వికెట్లతో చెలరేగగా.. సైమా టాకోర్(2/30), గ్రేస్ హారీస్(2/8) రెండేసి వికెట్లు పడగొట్టారు. సోఫీ ఎక్లెస్టోన్కు ఓ వికెట్ దక్కింది.
మలుపుతిప్పిన దీప్తి శర్మ..
ఢిల్లీ విజయానికి 12 బంతుల్లో 15 పరుగులు కావాల్సిన సమయంలో 19వ ఓవర్ వేసిన దీప్తి శర్మ సంచలన బౌలింగ్తో మూడు వికెట్లు తీసి 5 పరుగులు మాత్రమే ఇచ్చింది. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. గ్రేస్ హరీస్ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని రాధా యాదవ్ భారీ సిక్సర్ బాదింది.
రెండో బంతికి క్విక్ డబుల్ తీసినా.. నోబాల్ కోసం అప్పీల్ చేయడంతో హైడ్రామా చోటు చేసుకుంది. థర్డ్ అంపైర్ నో బాల్ కాదని తేల్చడంతో ఢిల్లీ విజయానికి 4 బంతుల్లో 2 పరుగులు అవసరమయ్యాయి. దాంతో ఆ జట్టు విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ రాధా యాదవ్ మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన తానియా భాటియా క్విక్ సింగిల్కు ప్రయత్నించగా.. నాన్స్ట్రైకర్ జెస్ జొనాస్సెన్(11) రనౌటైంది. క్రీజులోకి వచ్చిన టిటాస్ సధు కూడా క్యాచ్ ఔటవ్వడంతో యూపీ వారియర్స్ సంచలన విజయాన్ని అందుకుంది.
సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను ఢిల్లీ క్యాపిటల్స్ చేజేతులా చేజార్చుకుంది. ఇది యూపీ వారియర్స్కు మూడో విజయం కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్కు రెండో పరాజయం.